telugu navyamedia
క్రైమ్ వార్తలు

చెట్టు బెరడుపై చెక్కిన సూసైడ్ నోట్… బాలుడి బలవన్మరణం

suicide

లాక్‌డౌన్ వేళ మనస్థాపంతో ఉరి వేసుకుని చనిపోయిన ఓ బాలుడి చివరి కోరిక కంటతడి పెట్టిస్తోంది. చనిపోయే ముందు చెట్టుపై చెక్కిన సూసైడ్ నోట్‌ హృదయాలను పిండేస్తోంది. తన శవాన్ని తన తండ్రి సమక్షంలోనే కిందకు దించాలని రాసి పెట్టి బాలుడు ఆత్మహత్య చేసుకోవడం తీవ్ర విషాదం నింపింది. ఈ విషాద సంఘటన ఉత్తర్‌ ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. బిజ్‌నూర్ జిల్లా షేర్‌కోట్ ప్రాంతానికి చెందిన తొమ్మిదో తరగతి విద్యార్థి షకీర్ అహ్మద్ అనూహ్యంగా ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామ సమీపంలోనే చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. చనిపోయే ముందు ఆ బాలుడు తాను ఉరి వేసుకుంటున్న చెట్టుపై సూసైడ్ నోట్ రాసి మరీ ప్రాణాలు తీసుకున్నాడు. తన శవాన్ని తన తండ్రి సమక్షంలోనే కిందకు దించాలని.. తనకు ఆయనే అంత్యక్రియలు నిర్వహించాలని చెట్టు బెరడుపైనే సూసైడ్ నోట్ చెక్కాడు.

బాలుడి తండ్రి జుల్ఫీకర్ అహ్మద్ రాజస్థాన్‌లోని కోట నగరంలో టైలర్‌గా పని చేస్తున్నాడు. లాక్‌డౌన్ కారణంగా అతను అక్కడే చిక్కుకుపోయాడు. సుమారు 700 కిలోమీటర్ల దూరంలో చిక్కుకుపోయిన తండ్రి తన మరణంతోనైనా ఇక్కడికి రావాలని బాలుడు కోరుకోవడం కంటతడి పెట్టిస్తోంది. అయితే లాక్‌డౌన్ నిబంధనల కారణంగా తండ్రి సమక్షంలోనే తన శవాన్ని కిందకు దించాలన్న బాలుడి చివరి కోరిక నెరవేరలేదు. చెట్టుకు వేలాడుతున్న బాలుడి మృతదేహాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకున్నారు. చెట్టుపై బాలుడు రాసిన సూసైడ్ నోట్ ఆధారంగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. కొడుకు అంత్యక్రియల కోసం తండ్రిని స్వగ్రామానికి రప్పించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related posts