* తెలుగు దేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం
* 40 వసంతాల టీడీపీ పేరుతో వేడుకలు
* రాష్ట్రవ్యాప్తంగా తెలుగు తమ్ముళ్ల సంబరాలు
తెలుగుదేశం పార్టీ.. తెలుగువాడి ఆత్మగౌరవం నినాదంతో స్వర్గీయ ఎన్టీఆర్ ప్రాణం పోసిన కొత్త తరహా రాజకీయం. నటుడిగా ఎన్నో మైలురాళ్లు చేరుకున్న ఎన్టీఆర్ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం 1982 మార్చి 29వ పార్టీని స్థాపించారు. వంద ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ నుంచి అధికారాన్ని హస్తగతం చేసుకోవడమంటే మాటలు కాదు. అలాంటిది పార్టీ పెట్టిన ఏడాదిలోపే టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చారు ఎన్టీఆర్.
ఎన్టీఆర్ హయాంలో 1983, 1985, 1989, 1994లలో శాసనసభకు ఎన్నికలు జరగ్గా 3 సార్లు టీడీపీ ఘన విజయం సాధించింది. గెలిచిన 3 సార్లూ 200కిపైగా స్థానాలు దక్కించుకుంది. 1984, 1991 లోక్సభ ఎన్నికల్లో అత్యధిక స్థానాలనూ దక్కించుకుంది. 1994 శాసనసభ ఎన్నికల్లో ఘన విజయం తర్వాత.. పార్టీలో అంతర్గత పరిణామాలతో చంద్రబాబు ముఖ్యమంత్రిగా 1995 సెప్టెంబరు 1న చంద్రబాబు బాధ్యతలు చేపట్టారు. పార్టీ అధ్యక్షుడిగా పట్టు సాధించారు. తర్వాత జాతీయ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారారు. టీడీపీ ఎంపీ బాలయోగి లోక్సభ స్పీకర్గా ఎన్నికయ్యారు. రాష్ట్రపతిగా అబ్దుల్ కలాం ఎంపిక వంటి సందర్భాల్లో టీడీపీది కీలకం.
1999లో శాసనభ ఎన్నికల్లో 180 స్థానాలు గెలుచుకుని చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రయ్యారు. 2004, 2009లో మాత్రం టీడీపీకి ఓటమి తప్పలేదు. ఆ తర్వాత రాష్ట్ర విభజన జరిగింది.. 2014లో శాసనసభ, లోక్సభ ఎన్నికల్లో టీడీపీ తిరిగి అధికారంలోకి వచ్చింది.. చంద్రబాబు మూడోసారి ముఖ్యమంత్రయ్యారు.2019 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ చేతిలో టీడీపీ ఓడిపోయింది.. ప్రధాన ప్రతిపక్షంగా కొనసాగుతోంది.
4 దశాబ్ధాల రాజకీయాల్లో అప్రతిహత విజయాలను తెలుగుదేశం సాధించింది. ఒక ప్రాంతీయ పార్టీ చరిత్రలో నాలుగు దశాబ్దాలంటే తక్కువ సమయమేమీ కాదు. జాతీయ పార్టీలే కాలంతో పాటు మారలేక, కొత్త తరాన్ని ఆకట్టుకోలేక మనుగడ కోసం పోరాటం సాగిస్తుంటే…ప్రాంతీయ పార్టీగా అనేక ఆటుపోట్లు తట్టుకుని నిలబడింది. జాతీయ రాజకీయాల్లోనూ క్రియాశీలక పాత్రతో పాటు లోక్సభలో ప్రధాన ప్రతిపక్షంగా వ్యవహరించిన తొలి ప్రాంతీయ పార్టీగానూ ఘనత దక్కించుకుంది.
ఉమ్మడి రాష్ట్రంలో 16 సంవత్సరాలు, రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఐదేళ్లు కలిపి…. మొత్తం 21సంవత్సరాలు తెదేపా అధికారంలో కొనసాగింది. ఎన్టీఆర్ వేసిన బలమైన పునాది, చంద్రబాబు దార్శనికత, నిబద్ధతగల కార్యకర్తల వల్లే పార్టీ నలభైఏళ్ల సుదీర్ఘ ప్రస్తానాన్ని విజయవంతంగా పూర్తి చేసుకోగలిగిందని సీనియర్ నేతలు చెబుతున్నారు. టీడీపీని స్థాపించి నేటితో 40 వసంతాలు పూర్తయింది. టీడీపీని స్థాపించి నేటితో 40 వసంతాలు పూర్తయింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ లో జరిగే కార్యక్రమాల్లో అధినేత చంద్రబాబు పాల్గొననున్నారు. అమరావతి కేంద్రంగా జరిగే కార్యక్రమాల్లో పాల్గొననున్నారు నారా లోకేష్. సాయంత్రం 4గంటలకు హైదరాబాద్ ఆదర్శ్ నగర్ లో పార్టీ ప్రకటించిన న్యూ ఎమ్మెల్యే క్వార్టర్సును సందర్శించనున్నారు చంద్రబాబు, తెలుగుదేశం నేతలు. సాయంత్రం 5గంటలకు ఎన్టీఆర్ ఘాట్లో ఎన్టీఆర్ సమాధికి నివాళులర్పిస్తారు చంద్రబాబునాయుడు. సాయంత్రం 6గంటలకు హైదరాబాద్ ఎన్టీఆర్ భవన్ లో జరిగే పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో పాల్గొంటారు చంద్రబాబు.
అలాగే అమరావతి పార్టీ కేంద్ర కార్యాలయంలో టీడీపీ 40 వసంతాల వేడుకల్లో పాల్గొంటారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. సాయంత్రం 4 గంటలకు ఉండవల్లిలోని నివాసం నుండి టీడీపీ కేంద్ర కార్యాలయం వరకూ జరిగే బైక్ ర్యాలీలో పాల్గొంటారు లోకేష్. సాయంత్రం గంటలకు టీడీపీ కేంద్ర కార్యాలయంలో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు లోకేష్.
శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకూ కడప నుంచి కర్నూలు వరకూ వాడవాడలా టీడీపీ నేతలు పార్టీ జెండా ఆవిష్కరణ వేడుకల్లో పాల్గొంటారు. బైక్ ర్యాలీలతో హోరెత్తించనున్నారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నారు.