కేసీఆర్ పిలుపు మేరకు వరి ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టీ ఆర్ ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతు ధర్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సిద్దిపేటలో సిద్దిపేట ఆర్డీవో కార్యాలయం దగ్గర చేపట్టిన మహా ధర్నాలో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు. ఈ ధర్నా కు పెద్ద ఎత్తున రైతులు ,పార్టీ శ్రేణులు తరలి వచ్చారు
రైతులతో కలిసి కేంద్ర సర్కార్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దుక్కి దున్నే రైతు దుఃఖం తీర్చేందుకే ధర్నా చేస్తున్నామని , అన్నం పెట్టే వాళ్ల నోట్లో మోదీ ప్రభుత్వం సున్నం కొట్టేందుకు యత్నిస్తోందని మంత్రి హరీశ్ విమర్శించారు. జై కిసాన్ను భాజపా ప్రభుత్వం నై కిసాన్గా మార్చిందని ఎద్దేవ చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తరువాత మొదటి సారి వడ్లు కొనబోమని చెప్పిన ఘనత బీజేపీదే అని అన్నారు.
పంజాబ్ లో మొత్తం వడ్లు కొంటున్న కేంద్రం.. తెలంగాణలో మాత్రం ఎందుకు కొనట్లేదని ప్రశ్నించారు. రైతులపై కార్లు ఎక్కించి చంపితే.. ఆ కేంద్ర మంత్రి, మంత్రి కొడుకును ఎందుకు అరెస్ట్ చేయలేదని నిలదీశారు. ప్రశ్నించే రైతులపై ఉగ్రవాద ముద్ర వేస్తున్నారన్నారు. గాంధీ ని చంపిన గాడ్సే ను దేశభక్తుడని అనడం దేశభక్తా అని అన్నారు.
కేంద్ర బీజేపీ నేతలు, రాష్ట్ర బీజేపీ నేతలు తలోమాట మాట్లడుతున్నారని ..రైతులు బాగుపడుతుంటే కేంద్రం యాసంగిలో వడ్లు కొనమంటున్నరని అన్నారు. ఏపీలో సీఎం జగన్.. కేంద్ర సర్కారు నిబంధనలు అనుసరించి సాగు మీటర్లు పెట్టారని ఆరోపించారు. వరిధాన్యం కొనుగోలు విషయంలో.. ఇప్పటికైనా కేంద్రంలో మార్పు రాకపోతే రైతుల ఆగ్రహానికి కమలం వాడిపోతుందని హెచ్చరించారు.