వినాయకచవితి, దసరా ఉత్సవాల సందర్భంగా హుస్సేన్సాగర్లో విగ్రహాల నిమజ్జనంపై తమకు వివరాలు సమర్పించాలని మరోసారి తెలంగాణ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దేశంలో కరోనా మహమ్మారి మూడో దశ విజృంభుస్తున్న నేపథ్యంలో హైకోర్టు తెలంగాణ ప్రభుత్వానికి ప్రశ్నించింది.
రాబోయే వినాయక చవితి నిమజ్జనంలో జనం భారీగా గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకుంటారు… రసాయనాలతోకూడిన విగ్రహాలు హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయకుండా చర్యలేమిటి అని ప్రశ్నించింది. ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని ప్రభుత్వానికి సూచనలు జారీ చేసింది.
ఇక సెప్టెంబరు 1లోగా నివేదికలు సమర్పించాలని జీహెచ్ఎంసీ, హైదరాబాద్ సీపీలకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదిక సమర్పించకపోతే సీనియర్ అధికారులు హాజరు కావాలని హైకోర్టు పేర్కొంది. హుస్సేన్ సాగర్ లో గణేష్, దుర్గ విగ్రహాల నిమజ్జనం నిషేధించాలన్న న్యాయవాది వేణుమాధవ్ పిల్ పై విచారణ జరిపింది.
ఇళ్లల్లోనే మట్టిగణపతులను పూజించాలని ప్రజలకు సూచిస్తామని ప్రభుత్వ న్యాయవాది చెప్పగా… సూచనలు కాదు.. స్పష్టమైన ఆదేశాలు ఉండాలని హైకోర్టు తెల్చి చెప్పింది. మతపరమైన సెంటిమెంట్లు మంచిదే కానీ.. ప్రజల ఆరోగ్యాన్ని పణంగా పెట్టొద్దని పేర్కొంది హైకోర్టు. కాగా వినాయక నిమజ్జనంపై తదుపరి విచారణ సెప్టెంబరు 1కి వాయిదా వేసింది.