ఏపీ సీఎం జగన్ ఏడాది పాలనపై టీడీపీ నేత యనమల రామకృష్ణుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ… జగన్ ఏడాది పాలన అంతా వాత, కోత, రోతగా ఉందని ఎద్దేవా చేశారు. ప్రజలను మభ్యపెట్టే పథకాలతో పేదలను జగన్ వంచించారని ఆయన ఆరోపించారు.
గత ఐదేళ్ల కాలంలో టీడీపీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలను రద్దు చేసి జగన్ మాయ పథకాలు తెచ్చారని యనమల దుయ్యబట్టారు. ఏడాదిలోనే జగన్మాయ నుంచి జనం బయటపడ్డారని ఆయన అన్నారు. వైసీపీ పాలనతో రాష్ట్రంలో పేదరికం, అసమానతలు పెరిగాయని చెప్పారు. ప్రజా సంక్షేమ పథకాల రద్దుతో రూ.18,026 కోట్ల లబ్ధిని పేదలకు దూరం చేశారని ఆయన అన్నారు.