కరోనా వ్యాపిస్తున్న కష్టకాలంలో అందించే సాయాన్ని అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరు పేదలకు ప్రభుత్వం అందజేస్తున్న వెయ్యి రూపాయల సాయాన్ని, రేషన్ దుకాణాల ద్వారా చేస్తున్న నిత్యావసరాల పంపిణీని రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు.
అధికార పార్టీ తీరును ఎండగడుతూ టీడీపీ నేతలు యనమల రామకృష్ణుడు, అచ్చెన్నాయుడు, రామానాయుడులు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్కు లేఖ రాశారు. లాక్డౌన్ సందర్భంగా భౌతిక దూరం పాటించాలని చెబుతున్నా వైసీపీ నేతలు గుంపుగా వెళ్లి సాయాన్ని పంపిణీ చేస్తూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారని ధ్వజమెత్తారు. స్థానిక ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఈ సాయాన్ని పంపిణీ చేస్తూ తమ ఓటు బ్యాంకు కోసం ప్రయత్నిస్తున్నారని అన్నారు. తక్షణమే ఈ వ్యవహారంపై చర్యలు తీసుకోవాలని లేఖలో కోరారు.