నరసారావుపేటలో కోడెల శివప్రసాద్ నివాసం వద్ద కేబుల్ వైర్లతో ఉన్న ట్రాక్టర్ను వైసీపీ నేతలు వదిలి వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య కేబుల్ వార్ జరిగింది. ఈ నేపథ్యంలో మాజీ స్పీకర్ టీడీపీ నేత కోడెల శివప్రసాద్ అసహనం వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ స్పీకర్ అయిన తనకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు.
తన కుటుంబంపై రాజకీయ వేధింపులు కొనసాగుతున్నాయని మండిపడ్డారు. తన ఇంటిపై వైసీపీ నేతలు దాడికి యత్నించారని ఆరోపించారు. రాజకీయ కక్షతోనే తన కుటుంబ సభ్యులపై ఎన్నో తప్పుడు కేసులు పెట్టారని అన్నారు. పోలీసులు తనకు, తన కుటుంబానికి రక్షణ కల్పించకపోతే శాంతియుతంగా ఆందోళన చేపడతానని ప్రకటించారు. పార్టీ ఆదేశాల మేరకు పోరాటం కొనసాగిస్తానని చెప్పారు.