ఏపీలో ఇసుక కొరత వల్ల అధిక ధరలకు ఇసుక బస్తాలని విక్రయిస్తున్నారని టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు విమర్శించారు. ఈరోజు ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సిమెంట్ బస్తా ధర కన్నా ఇసుక బస్తా ధర అధికంగా ఉందని అన్నారు. ఏపీలో కొత్త ప్రభుత్వం ఇసుక పాలసీని ఇంకా అమలు చేయకపోవడంపై ఆయన విరుచుకుపడ్డారు.
తమ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల గురించి ఆయన ప్రస్తావించారు. వైసీపీ తమ రౌడీయిజాన్ని పులివెందులలో చూపించుకోవాలని అన్నారు. తమను భయపెట్టాలని చూస్తే ఊరుకోమని చంద్రబాబు హెచ్చరించారు. వైసీపీ నేతల తీరు ఇలానే ఉంటే భవిష్యత్ లో రాష్ట్రం అనాథగా మారిపోతుందని అన్నారు. ప్రజలు తిరగబడితే వైసీపీ నేతలు పారిపోక తప్పదన్నారు. రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని వాటిని అరికట్టకుండా టీడీపీ కార్యకర్తల పై దాడికి పాల్పడుతున్నారని ఆరోపించారు.