“అర్జున్ రెడ్డి” చిత్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం తెలిసిందే. సందీప్ వ్యాఖ్యలపై మహిళా లోకం భగ్గుమంటోంది. పలువురు హీరోయిన్లు, మహిళా జర్నలిస్టులు సందీప్ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేశారు. సందీప్ వంగా “అమ్మాయి, అబ్బాయి గాఢంగా ప్రేమించుకుంటున్నప్పుడు.. ఒకర్నొకరు కొట్టుకోవడం, ముట్టుకోవడం లాంటివి చేయకపోతే ఆ బంధంలో ఎమోషన్ ఉండదని నా అభిప్రాయం” అని వ్యాఖ్యానించారు. అవికాస్తా వివాదానికి దారి తీయడంతో ఈ వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని, ఎవరినో కించపరిచే ఉద్దేశంతో తాను అలా అనలేదని సందీప్ వివరణ ఇచ్చారు. అయినప్పటికీ సందీప్ వ్యాఖ్యలపై బాలీవుడ్ రచయితలు, దర్శకులు, నటీనటులు విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా హీరోయిన్ తాప్సి.. సందీప్ వ్యాఖ్యలకు పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది. మహారాష్ట్రలోని నాగ్పూర్ జిల్లాలో ఓ వ్యక్తి తన ప్రియురాలిపై అనుమానంతో ఆమె తల పగలగొట్టి దారుణంగా చంపేసిన సంగతి తెలిసిందే. ఓ ఆంగ్ల వెబ్సైట్లో వచ్చిన ఈ వార్తను తాప్సి ట్యాగ్ చేస్తూ.. `అనుమానంతో తల పగలగొట్టాడా? వారిద్దరూ పిచ్చి ప్రేమలో ఉండుంటారు. తన నిజమైన ప్రేమను నిరూపించుకోవడానికే అతను ఆమెను చంపేశాడేమో` అంటూ ట్వీట్ చేసింది. ఈ ట్వీట్పై విమర్శలు రావడంతో.. `హాస్యాన్ని ఆస్వాదించలేని వారు నా ట్వీట్ను పట్టించుకోవాల్సిన అవసరం లేద`ని తాప్సి రిప్లై ఇచ్చింది.
previous post