మెగాస్టార్ చిరంజీవి ప్రధానపాత్రలో సురేందర్రెడ్డి దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన చిత్రం “సైరా నరసింహారెడ్డి”. అమితాబ్, కిచ్చా సుదీప్, విజయ్ సేతుపతి, జగపతి బాబు, అనుష్క, తమన్నా, నయనతారలాంటి భారీ తారాగణంతో తెరకెక్కిన ఈ చిత్రాన్ని రామ్ చరణ్ నిర్మించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 2న విడుదల కానున్న ఈ చిత్రానికి సంబంధించి జోరుగా ప్రమోషన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్లు, ట్రైలర్ సామాన్యులతోపాటు సినీ ప్రముఖులను సైతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఉయ్యలవాడ నర్సింహారెడ్డి పాత్రలో కనిపించాలని మెగాస్టార్ చిరంజీవి ఎప్పట్నుంచో అనుకుంటున్నారు. ఎట్టకేలకు అది కార్యరూపం దాల్చింది. అయితే గత కొద్ది రోజులుగా చిత్రంకి సంబంధించి అనేక వివాదాలు చెలరేగుతూ వస్తున్నాయి. అయితే అన్నింటిని చక్కదిద్ది రేపు మూవీని రిలీజ్ చేసే ప్రయత్నాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు. కాగా ‘సైరా’ కోసం ప్రేక్షక లోకం అసక్తిగా ఎదురుచూస్తోంది. మరికొద్ది గంటల్లో విడుదల కానున్న ఈ సినిమాపై అంచనాలు తారస్థాయిలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రముఖ జర్నలిస్ట్, సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డు సభ్యుడు ఉమైర్ సంధు ‘సైరా’ సినిమా చూసి సోషల్ మీడియా ద్వారా తన అభిప్రాయాలను వెల్లడించారు. ‘సైరా’ చూస్తున్నంత సేపూ రోమాలు నిక్కపొడుచుకోవడం ఖాయం. స్వాతంత్ర్య పోరాటంలో జరిగిన ఎన్నో విషయాలను కళ్లకు కట్టినట్లు చూపించడంలో దర్శకుడు సురేందర్ రెడ్డి విజయవంతం అయ్యారు. సినిమాలో కొన్ని సన్నివేశాలు గుండెలను హత్తుకుంటాయి. తొలిసారి చారిత్రక పాత్రలో నటించిన చిరంజీవి చరిత్రలో నిలిచిపోతారు. జాతీయ అవార్డే తన కోసం వేచి చూసేలా అత్యద్భుతంగా నటించారు. నర్సింహారెడ్డి ఇలాగే ఉండేవారేమోననే రీతిలో చిరంజీవి ఆ పాత్రలో జీవించారు. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్మురేపడం ఖాయం. హిందీ బెల్ట్లో కూడా ఈ సినిమా రికార్డులు సృష్టిస్తుంది” అని ఉమైర్ వరుస ట్వీట్లు చేశారు. ఉమైర్ సంధు ట్వీట్లతో మెగాభిమానులు పండగ చేసుకుంటున్నారు. అయితే ఉమైర్ సందు ఇప్పటివరకు ఇచ్చిన ఏ రివ్యూ కూడా కరెక్ట్ గా లేదు. ఆయన 4, 5 స్టార్స్ రేటింగ్ ఇచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. మరి “సైరా” విషయంలో ఏమవుతుందో చూడాలి.
previous post