ఈరోజులలో పాఠశాలలు వారివారి పిల్లలను బడికి తీసుకెళ్లేందుకు బస్సులు వాడుతున్నాయి. కానీ అవి రావడానికి కూడా అవకాశం లేని ప్రాంతాలు ఇంకా ఉన్నాయంటే నమ్మకతప్పడంలేదు. అందుకు సాక్ష్యమే ఈ సందర్భం. పాఠశాలలో చదువుకునేందుకు కొందరు విద్యార్థులు సైకిళ్లపై, బస్సుల్లో వస్తుంటారు. ఈ విద్యార్థులు మాత్రం జేసీబీలో ప్రమాదకరంగా ప్రయాణించి బడికి వెళ్లారు. కర్నూలు జిల్లా కౌతాళం మండల పరిధిలోని కాత్రికి, లింగాలదిన్నె, అగసలదిన్నె, దొమ్మెలదిన్నె, వీరాలదిన్నె గ్రామాల విద్యార్థులు ఉన్నత చదువుల కోసం నిత్యం కౌతాళం రావాల్సి ఉంటుంది.
తొలుత వారంతా కాలినడకన ఆరు కిలోమీటర్లు నడిచి బాపురం చేరుకుంటారు. అనంతరం అక్కడి నుంచి బస్సులు ఎక్కి కౌతాళం ఉన్నత పాఠశాలకు వస్తారు. పాఠశాల వేళల్లో బస్సులు రావు. రోడ్డుపై నిరీక్షించే సమయంలో అటుగా వచ్చే వాహనాల చోదకుల్ని అభ్యర్థించి వాటిపై ప్రయాణం సాగిస్తారు. శుక్రవారం ఓ జేసీబీ వాహనం ఆ మార్గంలో రాగా.. డోజర్లో ఇలా ప్రమాదకరంగా కూర్చొని పాఠశాలకెళ్లారు.