ఏపీ సీఎంగా వైఎస్ జగన్ పదవీ బాధ్యతలు స్వీకరించిన కొన్నిగంటల్లోనే అధికార యంత్రాంగంలో మార్పులు కనిపించాయి. ఆర్థిక వనరులు లేనందున ప్రభుత్వ శాఖలన్నీ ఇంజినీరింగ్ పనులు నిలిపివేయాలని సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం అన్ని శాఖల కార్యదర్శులను ఆదేశించారు. ఇంజినీరింగ్ పనుల కారణంగా ఖజానాపై పెనుభారం పడిందన్నారు. ప్రభుత్వ పనుల్లో నిధుల వ్యయం, బిల్లుల మంజూరుకు సంబంధించి స్పష్టతనిస్తూ సీఎస్ కొద్దిసేపటి క్రితం మెమో జారీచేశారు.
ఎఫ్ఆర్ బీఎం పరిమితులను పట్టించుకోకుండా చేసిన పనులతో రాష్ట్రంపై ఆర్థికంగా భారం పడిందని సీఎస్ పేర్కొన్నారు. ముఖ్యంగా, ప్రాధాన్యతలను పట్టించుకోకుండా చేపట్టిన ప్రాజక్టు పనుల్ని సమీక్షించాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో క్రమంగా దిగజారుతున్న ఆర్థిక వనరులు అనాలోచిత నిర్ణయాలను ప్రతిబింబిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ ఏడాది ఏప్రిల్ 1 కంటే ముందు మంజూరైనా, ఇంకా ప్రారంభించని పనులు ఏవైనా ఉంటే వాటిని రద్దు చేయాలని సీఎస్ స్పష్టం చేశారు.