ఒక యువకుడి జీన్స్ ప్యాంటులోకి విషపూరిత పాము దూరగా ఆ యువకుడు రాత్రంతా కదలకుండా నిల్చొని జాగారం చేసిన సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మీర్జాపూర్ జిల్లాలో జరిగింది. తెల్లవారిన తర్వాత పాములు పట్టేవారు వచ్చి ఆ పాముని యువకుడి ప్యాంటు నుంచి బయటకు తీశారు. ఈ విషయం తెలిసి పోలీసులు, ప్రజలు సంఘటన స్థలానికి పెద్ద సంఖ్యలో వచ్చారు. జమాల్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సికందర్పూర్ గ్రామంలో విద్యుత్శాఖ విద్యుత్ స్తంభాలు, వైర్లు ఏర్పాటు చేసే పనులు చేపట్టింది. ఈ పనులు చేసేందుకు వచ్చిన కార్మికులు గ్రామంలోని అంగన్వాడీ కేంద్రంలో రాత్రిపూట బస చేస్తున్నారు. ఆ కార్మికుల్లో ఒకడైన లవ్లేష్ నిద్రిస్తుండగా, ఒక విషపూరిత పాము అతడి ప్యాంటులోకి దూరింది. వెంటనే మెలకువ రావడంతో భయంతో లేచి నిల్చున్న ఆ యువకుడు అక్కడే ఉన్న స్తంభాన్ని పట్టుకుని కదలకుండా రాత్రంతా అలాగే ఉండి పోయాడు. ఉదయం స్థానికులు ఈ విషయాన్ని తెలుసుకుని, పాములు పట్టే వ్యక్తిని పిలుచుకురాగా అతను లవ్లేష్ ప్యాంటులోకి దూరిన పామును చాకచక్యంగా బయటకు తీశాడు. ఈ విషయమై పంచాయతీ సభ్యుడు మహేష్ సింగ్ మాట్లాడుతూ లవ్లేష్ ప్యాంటులోకి పాము దూరడంతో ముందస్తు జాగ్రత్తగా అంబులెన్స్ను కూడా పిలిపించామని చెప్పారు. పాములు పట్టే వ్యక్తి చాకచక్యంతోనే ఆ పామును బయటకు తీసి లవ్లేష్ను కాపాడగలిగామని చెప్పారు.
previous post