జమ్మూకశ్మీర్ కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్రం సంచలనం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. మోదీ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంపై పాకిస్థాన్ మండిపడుతోంది. ఆర్టికల్ 370 రద్దు నిర్ణయం అక్రమం అని పాక్ విదేశాంగ శాఖ మొరపెట్టుకుంటుంది. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై సవాల్ చేస్తామని తెలిపింది. జమ్మూకశ్మీర్ విషయంలో భారత సర్కారు ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కశ్మీర్ వివాదం రగులుతూనే ఉంటుందని స్పష్టం చేసింది.
భారత్ ఆక్రమిత కశ్మీర్ విషయంలో అక్కడి కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపింది. భారత అధీనంలో ఉన్న ఆ ప్రాంతం వివాదాస్పద ప్రాంతమని అంతర్జాతీయంగా అందరికీ తెలిసిందే. ఈ వివాద స్థితిని భారత ప్రభుత్వం తీసుకున్న ఎలాంటి ఏకపక్ష నిర్ణయాలు మార్చలేవని తెలిపింది. ఐక్యరాజ్యసమితి భద్రతామండలి తీర్మానాల దృష్ట్యా ఇది జమ్మూకశ్మీర్ ప్రజలకు, పాకిస్థాన్ కు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని ఓ ప్రకటన విడుదల చేశారు.