కంపాలాకు చెందిన మరియమ్ నబటాన్జీ అనే 39 ఏళ్ల మహిళ ఇప్పటివరకు 44 మంది పిల్లలకు జన్మినిచ్చింది. రెండున్నరేళ్ల క్రితం చివరగా నలుగురు పిల్లలకు ఒకే కాన్పులో జన్మనిచ్చిందీ మరియమ్ నబటాన్జీ. 44 మంది పిల్లలను పెంచే శక్తి లేక మరియమ్ భర్త ఆమెను, పిల్లలను వదిలేసి వెళ్లిపోయాడు. ఇప్పడు మరియమ్ తన పిల్లలను పెంచి పోషించే శక్తి లేక కష్టాలను అనుభవిస్తోంది. 12 ఏళ్లకే మరియమ్కు వివాహం జరగగా.. ఏడాదికే కవలలను జన్మనిచ్చింది. ఆమె అండాశయం పెద్దదిగా ఉందని, ట్యాబ్లెట్ల ద్వారా గర్భాన్ని దూరం చేసుకుంటే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని డాక్టర్లు సూచించడంతో ఆమె పిల్లలను కంటూనే వచ్చింది. అలా ఒకే కాన్పులో నాలుగు సార్లు ముగ్గురు పిల్లలకు, ఐదు సార్లు నలుగురు పిల్లలకు జన్మనిచ్చింది.
అలా మొత్తంగా మరియమ్ 44 మంది పిల్లలను కనింది. భర్త లేకపోవడంతో తాను అనేక ఇబ్బందులు పడుతున్నానని తన పిల్లలకు సరైన భవిష్యత్తు అందించడానికి ప్రయత్నిస్తున్నానని మరియమ్ చెప్పింది. ఆయుర్వేద మందులను అమ్మడం, స్థానికంగా చిన్న చిన్న పనులను చేయడం ద్వారా వచ్చే డబ్బులు మొత్తం తిండికి, పిల్లల ఫీజులకు కూడా సరిపోవడం లేదని ఆవేదన చెందుతోంది. ఇక తల్లి కష్టాన్ని చూసిన 23 ఏళ్ల మరియమ్ కొడుకు విద్య మానేసి ఇంటి కోసం కష్టపడుతున్నాడు. తన తల్లి ఎంతో కష్టపడుతోందని, ఆమెకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని మరియమ్ కొడుకు అన్నాడు. కంపాలాకు ఉత్తరంగా 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతంలో నివసిస్తున్న మరియమ్, ఆమె పిల్లలు పూరి గుడిసె లాంటి ఇంట్లో జీవిస్తున్నారు. మరియమ్ కుటుంబం పెద్దది కావడం ఇల్లు చిన్నది అవడంతో పడుకోవడం కూడా కష్టమవుతోంది. కొంతమంది పిల్లలు ఇంటి బయటే పడుకోవాల్సి వస్తోంది.