హుజూర్నగర్ ఉప ఎన్నిక విజయంతో కేసీఆర్ మితిమీరి మాట్లాడుతున్నారని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్ మాట్లాడిన తీరు ఆశ్చర్యానికి గురిచేసింది. కేసీఆర్ ప్రతి మాటలో అధికార అహంభావం కొట్టొచ్చినట్లు కనిపించింది. ప్రజా శ్రేయస్సు కోసం ఆలోచిస్తున్నట్టు సీఎం మాటల్లో కనిపించలేదు.
అణగారిన వర్గాల్ని తొక్కేసే ఫ్యూడల్ విధానం కేసీఆర్ ప్రతి మాటలో కనిపించింది. కేసీఆర్ నిజస్వరూపం నిన్న స్పష్టంగా తెలిసింది. కడుపుకాలి కార్మికులు సమ్మెకు వెళ్తే పనికిమాలిన సమ్మె అంటారా. ఆర్టీసీ కేసీఆర్ సృష్టించింది కాదు. దశాబ్దాల నుంచి కొనసాగుతున్న సంపద. టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని ఇప్పటికే తాకట్టు పెట్టింది. ఇకనైనా అప్పులు, తాకట్టు పెట్టడం ఆపండని పేర్కొన్నారు.