మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్ కు సంబంధించిన మనీ లాండరింగ్ కుంభకోణం కేసులో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు బీజేపీ మిత్రపక్షమైన శివసేన నుంచి మద్దతు లభించింది. ఈ కుంభకోణంలో శరద్ పవార్ ప్రమేయం లేదని శివసేన కీలకనేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. శుక్రవారం ముంబైలో జరిగిన మీడియాతో సమావేశంలో ఆయన మాట్లాడుతూ కుంభకోణం వెలుగుచూసిన సమయంలో పవార్ అధికారంలో కూడా లేరని ఎంపీ సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు.
శరద్ పవార్ పెద్ద నాయకుడని… ఇలాంటి కేసుల్లో ఆయన పేరును లాగడం వల్ల మహారాష్ట్రలో అనారోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని అన్నారు. కోఆపరేటివ్ బ్యాంకుకు, పవార్ కు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు. కుంభకోణంలో పవార్ పేరును చేర్చే ముందు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈడీ సంప్రదించి ఉండాల్సిందని అన్నారు.