telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కచ్చితంగా మళ్ళీ బాలుగారు మనకోసం పాడతారు : విజయశాంతి

vijayashanthi

ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఆగస్టు 5న కరోనా బారిన పడి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా యావత్ సినీ లోకం కోరుకుంటుంది. అందులో భాగంగానే సినీ నటి, కాంగ్రెస్ నేత విజయశాంతి బాలు సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని కోరుకుంటున్నట్టుగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “బాలు గారు, వారి సుదీర్ఘమైన 54 సంవత్సరాల కళా ప్రస్థానంలో సాధించుకున్న అశేషమైన అభిమానుల ప్రేమ, పూజలతో కచ్చితంగా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి వస్తారని విశ్వసిస్తున్నాను. సౌతిండియన్ సినిమా సాంగ్స్‌కి ఎస్పీబీ పేరు ఒక బ్రాండ్ నేమ్ అనడం అతిశయోక్తి కాదు. డ్యాన్స్ రానివారితో కూడా స్టెప్స్ వేయించే శక్తి… మ్యూజిక్ తెలియనివారితో కనీసం హమ్మింగ్ చేయించే పవర్ బాలు పాటకు సొంతం. కనీసం రెండు తరాల జీవితాలు బాలూ గారి పాటతో పెనవేసుకుని ఉంటాయి. ఒక తరం పూర్తిగా బాలూగారి పాటలు వింటూ పెరిగింది. ఎస్పీబీ గారు తన గానంతో అలరించడమే కాకుండా… టీవీ షోల ద్వారా ఎందరో గాయనీగాయకుల్ని ప్రోత్సహించి, వాళ్ళు కూడా సినీ రంగంలో నిలదొక్కుకునేలా ఊతమిచ్చారు. పాటే కాదు, భావి తరాలకు వినయం, విధేయత లాంటి సుగుణాలు కూడా తెలిసేలా తన ప్రవర్తన ద్వారా నేర్పించారు. ఇవాళ వాళ్ళందరూ బాలూ గారి పాట కోసం మళ్ళీ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మన తెలుగువారే కాదు తమిళం, కన్నడం, మలయాళం… అలాగే ఉత్తరాది రాష్ట్రాల అభిమానులు కూడా ఎస్పీబీ రాక కోసం ఎదురు చూస్తున్నారు. ఇందరి సంకల్పం… కచ్చితంగా మళ్ళీ బాలుగారు మనకోసం పాడేలా చేస్తుంది” అని విజయశాంతి పోస్ట్ చేశారు.

Related posts