కుప్పలు తెప్పలుగా పాఠశాలలు పెరిగిపోవటం, దానితో నిర్వహణలో ఖర్చుకు కక్కుర్తిపడి, పిల్లలను తీసుకువెళ్లే బస్సులను సైతం అరకొర నిర్వహణతో నెట్టుకొస్తూ.. ఘోరమైన ప్రమాదాలకు కారణం అవుతున్నారు. ఇన్ని జరుగుతున్నా ఆ పాఠశాలలకు ఎటువంటి లీగల్ నోటీసులు అందకపోవటం, తెరవెనుక నగదుతో ఈ ప్రమాదాలను, పిల్లల ప్రాణాలను వెలకట్టి ఇస్తుండటంతో సరిపోతుంది. దీనికి అంతటికి కారణం విద్య ఒక వ్యాపారంగా అందరూ భావించడం, పాఠశాల నిర్వహణతో ఎంత వెనకేసుకున్నాం అనేది తప్ప పిల్లల ప్రాణాలపై శ్రద్ద, చదువు చెప్పే సమయంలో శ్రద్ద తగ్గి, ఈ ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. అయినా అటు తల్లిదండ్రులు, ప్రభుత్వం, పాఠశాల నిర్వాహకులతో మార్పు లేకపోవడం విషపు ఛాయలు ఎంతగా అలుముకున్నాయో చెప్పకనే చెపుతున్నాయి.
ఇక తాజా ఘటనలోకి వెళితే, హిమాచల్ ప్రదేశ్లోని సిర్మౌర్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పాఠశాల బస్సు అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మృతి చెందారు. దేవ్ పబ్లిక్ స్కూల్కు చెందిన బస్సు విద్యార్థులను తీసుకుళ్తుండగా రేణుకజి ప్రాంతంలో అదుపు తప్పి లోయలో పడినట్లు తెలిపారు. ప్రమాదంలో బస్సు డ్రైవరు, ఆరుగురు విద్యార్థులు మరణించగా.. పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు డిప్యూటీ కమిషనర్ లలిత్ జైన్ తెలిపారు. బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను బయటకి తీసుకురావడం కష్టతరంగా మారిందని చెప్పారు. డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు వెల్లడించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.