telugu navyamedia
సినిమా వార్తలు

“కొబ్బరి మట్ట” విడుదల చేయాలంటూ సెల్ టవర్ ఎక్కిన సంపూ అభిమాని

Kobbari matta

“హృదయ కాలేయం”, “సింగం 123” తర్వాత కొన్ని చిత్రాల‌లో స‌పోర్టింగ్ రోల్స్ చేసిన సంపూ ఇప్పుడు “కొబ్బరి మ‌ట్ట” చిత్రంతో ప్రేక్ష‌కుల‌ని అల‌రించేందుకు సిద్ధ‌మయ్యాడు. బ‌ర్నింగ్ స్టార్ గా అభిమానుల‌చే పిల‌వ‌బడుచున్న సంపూ 2015లో “కొబ్బ‌రి మ‌ట్ట” అనే చిత్రం మొద‌లు పెట్టాడు. ఈ చిత్రం ఎట్ట‌కేల‌కి ఆగ‌స్ట్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ చిత్రానికి రూపక్ రొనాల్డ్‌సన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో పెదరాయుడు, ఆండ్రాయుడ్, పాపారాయిడు ఇలా మూడు విభిన్న పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించాడు సంపూ. ఈ సినిమాలో సంపూర్ణేశ్ బాబు నటనపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే కొబ్బరిమట్ట సినిమాను తమ ప్రాంతంలో విడుదల చేయకపోవడంతో ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా యువకుడు సెల్ టవర్ ఎక్కాడు. జిల్లాలోని మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని బాబుకాలనీకి చెందిన డి.రామచంద్ర కుమారుడు రెడ్డెప్ప(23) బైకుల మెకానిక్ గా పనిచేస్తున్నాడు. సంపూర్ణేశ్ బాబుకు అభిమాని అయిన రెడ్డెప్ప, తమ ప్రాంతంలో కొబ్బరిమట్ట సినిమా విడుదల కాకపోవడంతో అసహనానికి లోనయ్యాడు.

గత శనివారం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమాను ఇక్కడ కూడా విడుదల చేయాలని దర్శకుడు రూపక్‌ రొనాల్డ్‌సన్‌, నిర్మాత సాయి రాజేశ్‌ నీలంలను డిమాండ్ చేశాడు. అయినా వారు స్పందించకపోవడంతో నిన్న మధ్యాహ్నం 3 గంటలకు రెడ్డప్ప స్థానిక అయోధ్యనగర్ లోని సెల్ టవర్ ఎక్కేశాడు. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ఎస్‌ఐ సునీల్‌కుమార్‌ తన సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకుని రెడ్డెప్పతో ఫోన్ లో మాట్లాడారు. కిందకు దిగాలని పోలీసులు కోరినా పట్టించుకోని రెడ్డెప్ప సాయంత్రం 6 గంటల వరకూ అక్కడే ఉండిపోయాడు. స్థానికులు పెద్దసంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో రెడ్డప్ప నానాహంగామా చేశాడు. ‘మిగిలిన హీరోల సినిమాలైతే విడుదల చేస్తారు..మా సంపూర్ణేష్‌బాబు చిత్రాన్ని ఎందుకు విడుదల చేయరు’ అని ప్రశ్నించాడు. దీంతో పోలీసులు రెడ్డెప్ప చిన్నమ్మ కుమారుడు ప్రశాంత్‌ను టవర్‌ ఎక్కించి కిందకు దింపే ప్రయత్నం చేశారు. చివరికి రెడ్డెప్పను పోలీస్ స్టేషన్ కు తరలించారు. రెడ్డెప్ప మద్యం మత్తులో సెల్ టవర్ ఎక్కినట్లు పోలీసులు తెలిపారు.

Related posts