కరోనా నియంత్రణలో భాగంగా అందరు ఇళ్లకే పరిమితం కావాలని బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ మరోసారి సోషల్ మీడియా వేదికగా ప్రజలను కోరారు. ఎటువంటి అవసరం లేకున్నా రోడ్లపైకి వచ్చి తిరుగుతున్నవారు వాళ్ల కుటుంబాలను ప్రమాదంలోకి నెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతరుల కోసం డాక్టర్లు, నర్సులు తమ జీవితాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. అలాంటి వారిపై రాళ్లు విసరడం చేస్తే.. మీ ప్రాణాలను ఎవరు కాపాడుతారని ప్రశ్నించారు. ఒకవేళ ప్రార్థన చేసుకోవాలని అనుకునేవారు ఇంట్లోనే ఉండి చేసుకోవాలన్నారు. మీరు బయటకు వచ్చి మీ కుటుంబ సభ్యుల జీవితాలను కూడా ఎందుకు ప్రమాదంలోకి నెడతారని ప్రశ్నించారు. అంతకు ముందు వేర్వేరు మతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు ఇంట్లోనే ప్రార్థనలు నిర్వహిస్తున్న ఓ ఫొటోను కూడా సల్మాన్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేశారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మాస్క్ ధరించడం ఎంతో ముఖ్యమో చెప్పిన సల్మాన్ తన స్నేహితుడికి ఎదురైన అనుభవాన్ని వివరించాడు. ఫామ్హౌస్లో ఉన్నవారి కోసం రేషన్ తీసుకురావడానికి నా స్నేహితుడు ఒకరు బయటకు వెళ్లాడు. రోడ్డుపై నా స్నేహితుడిని పోలీసులు అడ్డుకున్నారు. అయితే అతడు పోలీసులతో మాట్లాడానికి తన ఫేస్ మాస్క్ తొలగించాడు. కానీ విధుల్లో ఉన్న పోలీసులు మాస్క్ పెట్టుకోవాల్సిందిగా నా స్నేహితుడిని కోరారు. ఇంటికి వచ్చాక నేను కూడా మాస్క్ తీయడం మంచిది కాదని అతనికి చెప్పాను’ అని సల్మాన్ తెలిపారు.
View this post on Instagram