శ్రీలంక బాంబు పేలుళ్లను మరిచిపోక ముందే, అమెరికా నెత్తురోడింది. కాలిఫోర్నియా రాష్ట్రం శాన్ డియాగో నగరంలోని ఓ యూదు ప్రార్థనాలయంలోకి చొరబడ్డ దుండగులు.. తుపాకీతో విచక్షణారహితంగా కాల్పులు ప్రారంభించాడు. ఈ ఘటనలో ఓ మహిళ ప్రాణాలు కోల్పోగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. కాల్పుల అనంతరం నిందితుడు ఘటనాస్థలం నుంచి పరారయ్యాడు. శాన్ డియాగో నగరంలోని పోవేలో ఉన్న యూదు ప్రార్థనాలయంలో ఈ ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు.
ఈ కాల్పులు జరిపిన జాన్ ఎర్నెస్ట్(19) యువకుడిని అదుపులోకి తీసుకున్నామని వెల్లడించారు. ఇతను దాడి కోసం ఏఆర్ కేటగిరీకి చెందిన సెమీ ఆటోమేటిక్ రైఫిల్ వాడాడని పేర్కొన్నారు. హుటాహుటిన వైట్ హౌస్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన అధ్యక్షుడు ట్రంప్ దీన్ని విద్వేష దాడిగా అభివర్ణించారు. ఈ దుర్ఘటనలో చనిపోయిన మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ ఘటనలో నిందితుడిని పోలీసులు వెంటనే పట్టుకున్నారనీ, అందుకు ధన్యవాదాలు తెలిపారు.