చెట్టు లేనిదే మనిషి జీవితం లేదని.. మానవ మనుగడకు చెట్లు ప్రాణవాయువు లాంటిదని బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ఖాన్ పిలుపునిచ్చారు.
‘కభీ ఈద్ కభీ దివాలీ’ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చిన సల్మాన్ ఖాన్, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్తో కలిసి రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించిన “గ్రీన్ ఇండియా ఛాలెంజ్ 5.0”లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.
తర్వాత సల్మాన్ ఖాన్ మాట్లాడుతూ.. మొక్కలు నాటడాన్ని ప్రతి ఒక్కరు బాధ్యతగా తీసుకోవాలి. ఏదో మొక్కను నాటామా.. పని అయిపోయిందా అని కాకుండా ఆ మొక్క పెరిగే వరకు శ్రద్ధ తీసుకోవాలని అని కోరారు.
అకాల వర్షాలు, వరదలు, విపత్తులతో మన కళ్ల ముందే దేశంలో అనేక మంది ప్రజలు చనిపోతుండటం బాధాకరమన్నారు. వాతావరణ మార్పులతో జరిగే అనర్థాలు ఆగాలంటే మనం చెట్లు నాటడం ఒక్కటే మార్గమని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా..భావి తరాలకు ఉపయోగపడే మంచి కార్యక్రమం చేపట్టారంటూ ఎంపీ సంతోశ్ కుమార్ను సల్మాన్ ప్రశంసించారు. 16 కోట్లు మొక్కలే కాదు… భవిష్యత్లో సంతోశ్ ఆశయంతో అమెజాన్ ఫారెస్ట్ తరహాలో పెద్ద వృక్షసంపద సమకూరుతుందని ప్రశంసించారు.
గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో ప్రతి ఒక్కరూ పాల్గొని సంతోశ్ ఆశయానికి తోడ్పడాలని కోరారు. మొక్కల పెంపకంతోనే పర్యావరణ సమతుల్యం సాధ్యమని… పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో పాల్గొనాలని సల్మాన్ తన అభిమానులకు పిలుపునిచ్చారు.