telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

వాలంటీర్ పరీక్ష పేపర్ లీకైందన్న అనుమానాలు.. ఏపీపీఎస్సీ బంధువులకే టాప్ ర్యాంకులు!

AP-Grama-Sachivalayam

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిన్న గ్రామ వార్డు, వాలంటీర్ పరీక్షల ఫలితాలు వెల్లడించింది. ఈ పరీక్షలకు సంబంధించి ఫలితాలను విడుదల చేసిన ప్రభుత్వం.. ఈరోజు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను జిల్లాలవారీగా ప్రకటిస్తుందని విశ్వసనీయవర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఈ పరీక్ష ఫలితాల పై “ఆంధ్రజ్యోతి” దిన పత్రికలో ఓ సంచలన కథనం ప్రచురితమైంది. ఈ పరీక్ష పేపర్లను సిద్ధం చేసిన ఏపీపీఎస్సీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, వారి బంధువలే టాప్ ట్యాంకర్లుగా భారీ మార్కులు సాధించారని సదరు పత్రిక తన కథనంలో తెలిపింది.

అనంతపురం జిల్లాకు చెందిన జి. అనితమ్మ అనే అమ్మాయి కేటగిరి-1 విభాగంగంలో టాపర్ గా నిలిచారనీ, అయితే ఆమె ఏపీపీఎస్సీ కాన్ఫిడెన్షియల్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగి(జూనియర్ అసిస్టెంట్)గా పనిచేస్తున్నారని వెల్లడించింది. గ్రామ వార్డు, సచివాలయం పేపర్ ను ఆమె టైప్ చేశారని గుసగుసలు వినిపిస్తున్నట్లు చెప్పింది. ఇక కేటగిరి-3లో ఫస్ట్ ర్యాంకర్ దొడ్డా వెంకట్రామిరెడ్డి ప్రకాశం జిల్లాకు చెందినవారు. ఈయన సొంత అన్న వెన్నా మహేశ్వర్ రెడ్డి ఏపీపీఎస్సీలోనే ఏఎస్ వో హోదాలో పనిచేస్తున్నారు.

అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖలో పనిచేసిన ఓ రిటైర్డు అధికారి చేతికి ఈ ప్రశ్నాపత్రం ముందుగానే వెళ్లిపోయినట్లు ఆంధ్రజ్యోతి పత్రిక తెలిపింది. ఏపీపీఎస్సీలో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కుటుంబంలో భార్య సహా ముగ్గురికి గ్రామసచివాలయం పరీక్షల్లో 3 ర్యాంకులు వచ్చాయని తెలిపింది. 150 మార్కులకు గానూ నిర్వహించిన ఈ పరీక్ష చాలా కఠినంగా ఉందని పలువురు అభ్యర్థులు చెప్పారనీ, 100 మార్కులు దాటితే గొప్పేనని అభిప్రాయపడ్డారని సదరు పత్రిక పేర్కొంది. కానీ అనూహ్యంగా ఫస్ట్ ర్యాంకర్ కు 112.50 మార్కులు రావడంతో ప్రశ్నాపత్రం లీకేజీ జరిగిందన్న అనుమానాలు బలపడ్డాయని కథనంలో పేర్కొంది.

Related posts