telugu navyamedia
CBN ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు విద్యా వార్తలు

ఆంధ్రప్రదేశ్ లో కోచింగ్ సెంటర్ నిర్వాహణకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి

ఏపీలో ప్రైవేట్ కోచింగ్ సెంటర్ల నియంత్రణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. విద్యార్థులపై పెరుగుతున్న ఒత్తిడి, ఆత్మహత్యల నివారణే లక్ష్యంగా కీలక నిర్ణయాలు తీసుకుంది.

ఇకపై రాష్ట్రంలో కోచింగ్ సెంటర్ నిర్వహించాలంటే రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేస్తూ ‘ఏపీ కోచింగ్ సెంటర్ల నియంత్రణ, పర్యవేక్షణ నిబంధనలు-2026’ పేరుతో కొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది.

ఇప్పటికే నడుస్తున్న కేంద్రాలు కూడా మూడు నెలల్లోగా తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని స్పష్టం చేసింది.

ఇటీవలి కాలంలో విద్యార్థులపై ఒత్తిడి పెరిగి ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. కొత్త నిబంధనల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షతన ఒక కమిటీని ఏర్పాటు చేయనుంది.

ఈ కమిటీయే కోచింగ్ సెంటర్లకు రిజిస్ట్రేషన్లు మంజూరు చేయడం, విద్యార్థుల నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించడం వంటి బాధ్యతలు చూస్తుంది.

అంతేగాక‌ మీడియా కథనాలు లేదా పోలీసు రిపోర్టుల ఆధారంగా సుమోటోగా తనిఖీలు చేసే అధికారాన్ని కూడా ఈ కమిటీకి కల్పించారు.

కొత్త నిబంధనల ప్రకారం కోచింగ్ సెంటర్లు రోజుకు గరిష్ఠంగా ఐదు గంటలు మాత్రమే పనిచేయాలి. పాఠశాలలు, కళాశాలలు నడిచే సమయంలో కోచింగ్ తరగతులు నిర్వహించకూడదు. ఆదివారం తప్పనిసరిగా సెలవు ప్రకటించాలి.

విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం ప్రతి కేంద్రంలో ఒక వెల్‌నెస్ సెంటర్‌ను ఏర్పాటు చేసి, కౌన్సిలింగ్ అందించాలి. ఆత్మహత్యలను నివారించేందుకు స్ప్రింగ్ లోడెడ్ ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని నిబంధనల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

అడ్మిషన్ల సమయంలో విద్యార్థుల ఒరిజినల్ అకడమిక్ సర్టిఫికెట్లను తీసుకోరాదు. ప్రభుత్వ ఉపాధ్యాయులు, లెక్చరర్లు ఈ కోచింగ్ సెంటర్లలో పనిచేయడంపై నిషేధం విధించారు.

ప్రతి కోచింగ్ సెంటర్ తప్పనిసరిగా ఒక వెబ్‌సైట్‌ను నిర్వహించాలని, అందులో ఫీజులు, సిబ్బంది, మౌలిక వసతుల వివరాలను పొందుపరచాలని ఆదేశించారు.

 

Related posts