లాక్డౌన్ సమయంలో ప్రజల సమస్యలను తెలుసుకొని మరి వారికి సాయం చేసి రియల్ హీరోగా అనిపించుకున్నారు. సోనూసూద్. అడిగిన వారికి లేదనకుండా.. కాదనకుండా సాయం చేస్తూ వచ్చాడు. ఎన్నో సేవా కార్యక్రమాలను కొనసాగిస్తూ దేశ వ్యాప్తంగా మంచి ఇమేజ్ సాధించాడు. కరోనా తొలి నాళ్లలో లాక్డౌన్ కారణంగా పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయిన వలస కార్మిలకు సోనూసూద్ సొంత ఖర్చులతో ఇళ్లకు పంపించారు. అప్పటి నుంచి ఎవరి ఏ కష్టమొచ్చిన తన వంతు సాయం చేస్తున్నాడు.
ఈ రియల్ హీరోకి ఇప్పుడు దేశ వ్యాప్తంగా లక్షలాది మంది ఫ్యాన్స్ ఉన్నారు. నటుడిగా వచ్చిన గుర్తింపు కంటే.. సేవా కార్యక్రమాలతోనే సోనూ భాయ్ ఎక్కువ గుర్తింపు సాధించాడు. ఎన్నో సేవాకార్యక్రమాలు కొనసాగిస్తున్న ఆయన త్వరలో రాజకీయాల్లోకి రానున్నట్లు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఇన్నాళ్ళు రాజకీయాలపై ఆసక్తి లేదంటూ సోనూ చెబుతూ వచ్చాడు. అయితే సోనూ ఏ పార్టీ తరుపున పొలిటికల్ ఎంట్రీ ఇస్తాడని దేశ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు ఇదే హాట్ టాపిక్అయ్యింది.
అటు జాతీయ మీడియాలోనూ సోనూ సూద్ పొలికిల్ ఎంట్రీ దాదాపు ఖాయమైపోయినట్లు చర్చ జరుగుతోంది. 2022లో నిర్వహించనున్న బృహన్ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ (బి.ఎం.సి) ఎన్నికల్లో మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ తరఫున సోనూసూద్ పోటీ చేసే అవకాశం ఉందని ఊహాగానాలు వినిపించాయి. కాంగ్రెస్ ఈ సారి గట్టి పోటీ ఇచ్చేందుకు సెలబ్రిటీలని ఎంపిక చేసుకుందని, ఆ జాబితాలో సోనూతోపాటు మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి విలాస్రావు దేశ్ముఖ్ తనయుడు, నటుడు రితేశ్ దేశ్ముఖ్, మోడల్, ఫిట్నెస్ పర్సనాలిటీ మిలింద్ సోమన్ నిలిచారని టాక్ వినిపించింది. త్వరలోనే ఈ ముగ్గురిలో ఒకరిని మేయర్ అభ్యర్థిగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించే అవకాశాలున్నాయని ప్రచారం సాగింది.
అంతేకాకుండా ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం అర్వింద్ కేజ్రీవాల్తో ఈ రోజు సోనూ సూద్ భేటీ కానుండటమే ఈ చర్చకు కారణం. 2022లో పంజాబ్ అసెంబ్లీకి జరిగే ఎన్నికలపై ఆప్ ప్రత్యేక ఫోకస్ పెట్టింది. ఢిల్లీ తర్వాత పంజాబ్లో పార్టీ జెండా పాతాలని కేజ్రీవాల్ పట్టుదలగా ఉన్నారంట. దీనికి సంబంధించిన గ్రౌండ్ వర్క్ కూడా ఇప్పటికే మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలో కేజ్రీవాల్తో సోనూ సూద్ భేటీకానుండటం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. పంజాబ్ అసెంబ్లీ ఎన్నికలపైనే సోనూ సూద్తో కేజ్రీవాల్ చర్చలు జరిపే అవకాశముందని టాక్ వినిపిస్తోంది.
సోనూ సూద్ లేదా ఆయన సోదరి మాల్విక సచ్చర్ పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ టిక్కెట్పై మోగా నియోజకవర్గం నుంచి పోటీ చేసే అవకాశముందని పుకార్లు వినిపించాయి. ఈ నేపథ్యంలో సోనూ సూద్ ఢిల్లీలో కేజ్రీవాల్తో భేటీ కానుండటం పొలిటికల్ను పెంచింది. సోనూ సూద్ ఆప్లో చేరడం ఖాయమని జాతీయ మీడియా వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
అలాగే పంజాబ్ ప్రభుత్వ కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమానికి సోనూ సూద్ బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు. ఆ రకంగానూ పంజాబ్ ప్రజలకు సోనూ చాలా దగ్గరయ్యారు. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి తమ ప్రభుత్వం చేపట్టిన అవగాహన కార్యక్రమాలను ప్రచారం చేయడానికి, వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి అమరీందర్ సింగ్ సర్కార్.. ఆయనను ప్రచారకర్తగా నియమించుకుంది. ఒకరకంగా కాంగ్రెస్ ప్రభుత్వంతో సోనూ సూద్కు సత్సంబంధాలే ఉన్నాయని చెప్పొచ్చు.
తాజాగా సోనూసూద్ ఈ విషయంపై స్పందించారు. ఈ వార్తలు అవాస్తమని తెలిపారు. ‘ఈ వార్తల్లో నిజం లేదు. సాధారణ వ్యక్తిగా నేను చాలా ఆనందంగా ఉన్నాను’ అంటూ స్పష్టత ఇచ్చారు.
మరోపక్క సామాజిక మాధ్యమాల వేదికగా కొందరు నెటిజన్లు, ఆయన అభిమానులు సోనూసూద్ని రాజకీయాల్లోకి రావాలని కోరుతుండగా మరికొందరు వద్దని విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రెండింట్లో ఏది వాస్తవం అనే విషయం మరికొన్ని గంటల వ్యవధిలోనే ఈ విషయంలో ఓ క్లారిటీ వచ్చే అవకాశముంది.
ప్రియాంక హెయిర్ స్టైల్ ఫై వర్మ స్పందన