అయోధ్య రామమందిర నిర్మాణానికి ఈరోజు భూమిపూజ జరిగిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. హిందువులంతా భక్తిశ్రద్ధలతో పూజలు నిర్వహించారు. ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కూడా తన అధికార నివాసంలో రాముడికి పూజలను నిర్వహించారు. తాజాగా కేంద్ర మంత్రి రవిశంకర్ ప్రసాద్ ఒక ప్రత్యేకమైన ఫొటోను తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా షేర్ చేశారు.
రాజ్యాంగంలోని సీతారాముల ఫొటోను ఆయన పోస్ట్ చేశారు. ‘రాజ్యాంగం ఒరిజినల్ ప్రతిలో రావణుడిని చంపిన తర్వాత అయోధ్యకు తిరిగి వస్తున్న రాముడు, సీత, లక్ష్మణుడి అందమైన ఫొటోలు ఉన్నాయి. ప్రాథమిక హక్కులకు సంబంధించిన చాప్టర్ ప్రారంభంలో ఈ చిత్రం ఉంది. ఈ అందమైన చిత్రాన్ని మీ అందరితో పంచుకోవాలనిపించింది’ అని రవిశంకర్ ట్వీట్ చేశారు.