పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నిన్న ప్రారంభమయిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో భారత్-చైనా మధ్య ఉద్రిక్త పరిస్థితులపై స్పష్టతనివ్వాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమయ్యే లోక్సభలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఈ విషయంపై కీలక ప్రకటన చేయనున్నారు.
చైనాతో ఉన్న వాస్తవాధీన రేఖ వెంట నెలకొన్న పరిస్థితిపై సభలో చర్చ చేపట్టాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో దీనిపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. కాగా, తూర్పు లద్దాఖ్లోని హిమాలయాల సమీపంలో భారత్-చైనా సరిహద్దుల వద్ద చైనా శరవేగంగా ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ నెట్వర్క్ను వేస్తున్నారని భారత అధికారులు ఇప్పటికే తెలిపారు.
చర్చలు జరుపుతూనే మరోవైపు సుదీర్ఘ కాలంపాటు ప్రతిష్టంభనను కొనసాగేలా చైనా చేస్తుందని అన్నారు. దాడికి దిగాలంటే చైనాకు అత్యంత వ్యూహాత్మక ప్రాంతమైన లేహ్లోని పాంగాంగ్ టీఎస్ఓ వద్ద ఇటీవల చైనా వేసిన ఆప్టికల్ ఫైబర్ కేబుల్స్ కనపడ్డాయని అన్నారు. ఈ నేపథ్యంలో ఈ అంశం కీలకంగా మారింది.