రాష్ట్రంలోని 21.22 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఖరీఫ్ అవసరాలకు రైతుబంధు పధకంలో భాగంగా రూ.2,233.16 కోట్లు జమ చేశారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. సంబంధిత అధికారులు రైతుబంధు పధకం నిధులను విడతల వారీగా విడుదల చేస్తున్నారు. ఇప్పటికే నాలుగు విడతలుగా రైతుల ఖాతాల్లోకి రిజర్వుబ్యాంకు ఈ-కుబేర్ ద్వారా నేరుగా రైతుల ఖాతాలోకి రైతుబంధు డబ్బులు జమ చేస్తోంది. రైతుబంధు అకౌంట్ నెంబరు మార్చుకోవాలనుకునే రైతులు సమీప వ్యవసాయ కార్యాలయాలను సంప్రదించాలని మంత్రి సూచించారు.
ఖరీఫ్ సాగు ఇప్పటికే మొదలైన దృష్ట్యా రైతులు పంట పెట్టుబడులకు ఇబ్బంది పడకుండా రైతుల ఖాతాలోకి డబ్బు జమ చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. సహకార, మహిళా సంఘాలు, వ్యవసాయ మార్కెట్ల ద్వారా కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రూ.4,837 కోట్లు 3,85,217 మంది రైతులకు చెల్లించినట్లు మంత్రి పేర్కోన్నారు. ఇంకా రూ.1,080 కోట్ల బకాయిలు ఉన్నాయని మంత్రి వెల్లడించారు. మంగళవారం రూ.501 కోట్లు విడుదల చేసినట్లు తెలిపారు. రాష్ట్రానికి రుతుపవనాలు రానున్న నేపథ్యంలో రైతుబంధు డబ్బులు త్వరగా జమయ్యేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని మంత్రి తెలిపారు. ధాన్యం డబ్బులు, రైతుబంధు నిధుల విషయంలో రైతులు ఆందోళన చెందవద్దని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి భరోసా ఇచ్చారు.