లాక్డౌన్ అమలవుతున్న నేపథ్యంలో అత్యవసరంగా ఊరెళ్లాల్సిన వారి కోసం ప్రయాణ పాస్లు ఇక వారి ఇళ్లవద్దకే రానున్నాయి. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుంటే 8 నుంచి 16 గంటల్లోగా ప్రయాణ పాస్లు వారింటికే జారీ చేస్తామని హైదరాబాద్లోని రాచకొండ కమిషరేట్ పోలీసులు స్పష్టం చేశారు. పోలీసుల కఠిన ఆంక్షలు కొనసాగిస్తుండడంతో అత్యవసరంగా ప్రయాణించాల్సిన వారు పాస్ కోసం పోలీస్ స్టేషన్ల వద్ద బారులు తీరుతున్నారు. ఈ పరిస్థితిని నివారించేలా ఆన్లైన్ విధానం అమలు చేయాలన్న సీపీ మహేష్భగవత్ ఆదేశాల మేరకు రాచకొండ పోలీసులు ఈ విధానానికి శ్రీకారం చుట్టారు.
పాస్ కావాల్సిన వారు కమిషనరేట్ సైట్లోకి వెళ్లి ‘రిక్వెస్ట్ ఫర్ పాస్’ ఆప్షన్ను క్లిక్ చేసి వివరాలను నమోదు చేయాలి. సంబంధిత ధ్రువపత్రాలు, ఇతర ఆధారాలును అప్లోడ్ చేయాలి. సిబ్బంది పరిశీలించి అర్హులైన వారికి ఓ లింక్ను వారి మెయిల్కి పంపిస్తారు. దాన్ని ఓపెన్ చేస్తే పాస్ కనిపిస్తుంది. దాన్ని ప్రింట్ తీసుకుని వినియోగించుకోవచ్చు. ఈ విధానం వ్యక్తిగతంగాను, వాహనాలకు రెండు విధాలుగా అమలు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో వారు మాత్రమే ఈ అవకాశం వినియోగించుకోవాలని ఐటీ ఇన్స్పెక్టర్ శ్రీధర్రెడ్డి కోరారు.