రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విశాఖపట్నం చేరుకున్నారు. ప్రెసిడెంట్ నావల్ ఫ్లీట్ రివ్యూ కోసం విశాఖ వచ్చిన రాష్ట్రపతికి ఎయిర్పోర్ట్లో రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఘనంగా స్వాగతం పలికారు.
బంగాళాఖాతంలో రాష్ట్రపతి ఫ్లీట్ రివ్యూ-22ను నిర్వహించనున్న తూర్పు నౌకాదళ కమాండ్లో మూడు రోజుల పర్యటన నిమిత్తం ఆదివారం విశాఖకు చేరుకున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ను పురస్కరించుకుని, ‘ఇండియన్ నేవీ – 75 ఏళ్ల దేశ సేవ’ అనేది PFR-22 థీమ్గా చేయడం జరిగింది. సాయుధ దళాల సుప్రీం కమాండర్గా, ప్రతి భారత రాష్ట్రపతి తన ఐదేళ్ల కాలంలో భారత నావికాదళాన్ని ఒకసారి సమీక్షిస్తారు
ఆదివారం సాయంత్రం భువనేశ్వర్ నుంచి స్పెషల్ ఫ్లైట్లో విశాఖ వచ్చారు రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్. రాష్ట్రపతికి సీఎం వైఎస్ జగన్ స్వాగతం పలికారు. ఆ తర్వాత.. సీఎం జగన్ తిరుగుపయనమయ్యారు. రాష్ట్రపతి ఐఎన్ఎస్ డేగా నుంచి తూర్పు నౌకాదళ ప్రధాన కేంద్రంలో ఏర్పాటు చేసిన బస ప్రాంతానికి వెళ్లారు. సోమవారం ఉదయం 9.30 గంటలకు ప్రెసిడెన్షియల్ ఫ్లీట్ రివ్యూలో రాష్ట్రపతి పాల్గొంటారు. యుద్ధ నౌకల సమీక్ష కూడా ఉండనుంది. ఆర్కెబీచ్కు దగ్గరలో ఈ కార్యక్రమం జరగనుంది. రోడ్లపై ఎలాంటి ఆంక్షల్లేవని పోలీసులు చెబుతున్నారు.
రాష్ర్టపతి, సీఎం జగన్ ,కేంద్ర మంత్రులు, గవర్నర్, లెఫ్ట్నెంట్ గవర్నర్, నావికాదళ కమాండర్లతో పాటు దేశ, విదేశాల నుంచి పలువురు ప్రముఖులు నగరానికి చేరుకున్నారు.
ఈ నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు అధికారులు. రెండు వేల మంది పోలీసులతో కట్టుదిట్టమైన భద్రత కల్పించారు.
రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ పర్యటన షెడ్యూల్
*9.07 కి ఐ ఎన్ ఎస్ సుమిత్ర ను అధిరోహించనున్న రాష్ట్రపతి
*9.34 నుంచి 10. 43 వరకు యుద్ధ నౌకల సమీక్ష, మధ్యలో పెరేడ్ సెయిల్స్, సెర్చ్ అండ్ రెస్క్యూ డెమో, హాక్ డెమో
*10.44 నుంచి 10. 52 వరకు ఫ్లై ఫాస్ట్, ఏకకాలంలో ఎగిరి సుప్రీం కమాండర్ కి సెల్యూట్ చేయనున్న యుద్ధ విమానాలు, హెలికాఫ్టర్లు
*10.53 నుంచి 10.57 వరకు సబ్ మెరైన్ ల సమీక్ష
*10.58 నుంచి 11.02 వరకు మెరైన్ కమాండో ల విన్యాసాలు
*11.08 నుంచి 11.13 వరకు రాష్ట్రపతి ప్రసంగించనున్నారు.
*నౌకాదళ అధికారులతో గ్రూప్ ఫొటో, తపాలా బిళ్ల, పోస్టల్ కవర్ ఆవిష్కరణ తర్వాత 11.45 కి రాష్ట్రపతి విశ్రాంతి తీసుకోనున్నారు.


భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు ఎన్నికలు ఊపిరి : స్పీకర్ తమ్మినేని