విశాఖ ఉక్కు పోరాటం భావోద్వేగాల సమస్యగా మారుతోంది. కార్మిక ఉద్యమం అన్ని వర్గాలను కదిలిస్తోంది. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్లో దక్షిణ కొరియా దేశానికి చెందిన పోస్కో ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకుందనే వార్తలతో… ఏపీలోని ప్రతిపక్ష, అధికార పక్ష పార్టీలు ఉక్కు ఉద్యమంలోకి దిగాయి. ఈ విషయంలో టీడీపీ, వైసీపీ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఇది ఇలా ఉండగా.. విశాఖ క్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకిస్తూ టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు చేపట్టిన ఆమరణ దీక్షను పోలీసుల భగ్నం చేశారు. అర్థరాత్రి దీక్ష శిబిరానికి చేరుకున్న పోలీసులు.. అతన్ని బలవంతంగా ఆస్పత్రికి తరలించారు. ఈ సమయంలో టీడీపీ శ్రేణులు పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు, టీడీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ పరిరక్షణ కోసం గత ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్నారు పల్లా శ్రీనివాసరావు. ఇవాళ చంద్రబాబు విశాఖ పర్యటనకు రావాలని నిర్ణయించుకున్నారు. పల్లా శ్రీనివాసరావుకు సంఘీభావం తెలపాలని అనుకున్నారు. ఇంతలోనే ఆయన దీక్ష భగ్నం చేయడం చర్చనీయాంశంగా మారింది.