telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

కోహ్లీసేన.. ఆస్ట్రేలియాను ఓడించేనా ..

2nd odi between india-australia

నేడు వన్డేల సిరీస్‌లో భాగంగా ఆస్ట్రేలియాతో జరిగే మ్యాచ్‌లో కోహ్లీ సేన ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇప్పటికే తొలి మ్యాచ్‌ని సమర్పించుకున్న భారత జట్టు ఈ మ్యాచ్‌లో కూడా ఓడితే సిరీస్‌ కోల్పోతుంది. అంతులేని ఆత్మవిశ్వాసంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను ప్రారంభించిన టీమ్‌ఇండియా.. ఒక్క మ్యాచ్‌ పూర్తయ్యేసరికి తీవ్ర ఒత్తిడిలో కూరుకుపోయింది. మెరుగైన జట్ల మధ్య హోరాహోరీ పోరు ఖాయమనుకుంటే.. కంగారూల జోరు ముందు మనవాళ్లు కుదేలయ్యారు. బంగ్లాదేశ్‌, వెస్టిండీస్‌, శ్రీలంకపై సిరీస్‌లు నెగ్గి తమకు తిరుగులేదనుకుంటున్న టీమ్‌ఇండియాను.. ఫించ్‌ సేన నేలకు దించింది. ముంబైలో ఘోర పరాజయంతో 0-1తో వెనుకబడిన భారత్‌.. సిరీస్‌ను సమం చేసేందుకు సిద్ధమవుతోంది.

విరాట్‌ కోహ్లీ నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగినా ప్రయోగం బెడిసికొట్టడంతో.. ఈసారి తనకు అచ్చొచ్చిన వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా వాంఖడేలో కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేకపోయిన మన బౌలర్లు.. రాజ్‌ కోట్‌లో ఎలాంటి ప్రదర్శన చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ప్రపంచంలో అత్యుత్తమ బౌలింగ్‌ దళం భారత్‌దే. ప్రస్తుత టీమ్‌ ఇండియా పేస్‌ దళం.. 90ల్లో విండీస్‌ను తలపిస్తోందంటూ సిరీస్‌ ప్రారంభానికి ముందు చర్చ జరిగింది. కానీ, అసలు ప్రత్యర్థి ఎదురైతే కానీ మన డొల్లతనం బయటపడలేదు. వాంఖడేలో వార్నర్‌, ఫించ్‌ దంచికొడుతుంటే.. చూస్తూ నిల్చోవడం తప్ప మనవాళ్లు చేసిందేమీ లేదు. బుమ్రా, షమీ, శార్దూల్‌ కనీసం ప్రత్యర్థిని ఇబ్బంది కూడా పెట్టలేకపోయారు. మరి పెద్దగా అచ్చిరాని రాజ్‌కోట్‌పై మనవాళ్లు ఏం చేస్తారో చూడాలి.

రిషబ్‌ పంత్‌ గాయం నుంచి కోలుకోకపోవడంతో.. అతడి స్థానంలో రాహుల్‌ కీపింగ్‌ బాధ్యతలు మోయనున్నాడు. జాదవ్‌, దూబేల్లో ఒకరికి చాన్స్‌ దక్కొచ్చు. బౌలింగ్‌ దళంలో మార్పులు ఉండకపోవచ్చు. మరోవైపు తొలి విజయం ఇచ్చిన ఉత్సాహంలో ఉన్న ఆసీస్‌ రాజ్‌కోట్‌లోనూ రాణించి ఇక్కడే సిరీస్‌ ఒడిసి పట్టాలని పట్టుదలగా ఉంది.

Related posts