telugu navyamedia
తెలంగాణ వార్తలు

నేడు హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ..2వేల మంది పోలీసుల‌తో భారీ భ‌ద్ర‌త‌..

*నేడు హైద‌రాబాద్‌కు ప్ర‌ధాని మోదీ..
*ప్ర‌ధాని మోదీ ప‌ర్య‌ట‌న సంద‌ర్భంగా 2వేల మంది పోలీసుల‌తో భారీ భ‌ద్ర‌త‌..
*ఎయిర్‌పోర్టులో ప్ర‌ధాని గ‌వ‌ర్న‌ర్ త‌మిళ‌సై స్వాగ‌తం
*ప్ర‌భుత్వం త‌రుపున స్వాగ‌తం ప‌ల‌క‌నున్న త‌ల‌సాని
*విద్యార్ధుల సోష‌ల్ మీడియా ఆకౌంట్‌ల‌పై నిఘా

నేడు హైద‌రాబాద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు. ప్రధానికి ఘన స్వాగతం పలికేందుకు అధికార యంత్రాంగంతో పాటు భాజపా రాష్ట్ర శాఖ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. గచ్చిబౌలిలోని ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ వార్షికోత్సవ, స్నాతకోత్సవ కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు.

ఐఎస్‌బీ ఈవెంట్‌లో హైదరాబాద్, మొహాలీ క్యాంపస్‌లకు చెందిన దాదాపు 930 మంది విద్యార్థులు ఇందులో పాల్గొననున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రధాని మోదీకి వ్యతిరేకంగా సోష‌ల్ మీడియాలో ఏవైనా పోస్టులు పెట్టారా? అని వాళ్ల అకౌంట్లను చెక్ చేస్తున్నారు.

ప్రధాని పర్యటనలో ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఒక్క ఐఎస్‌బీ ప్రాంగణంలోనే రెండు వేల మంది పోలీసులను మోహరించారు. ప్రధాని హాజరుకానున్న ఐఎస్‌బీ స్నాతకోత్సవానికి పాస్‌లు ఉంటేనే అనుమతిస్తారు.

ఈ స్నాతకోత్సవంలో 2022 సంవత్సరానికి గాను పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసుకున్న 930మంది విద్యార్థులకు పట్టాలు పంపిణి చేయనున్నారు.

ప్రధాని మోదీ హైదరాబాద్ టూర్ షెడ్యూల్..

ప్రధాని నరేంద్ర మోదీ మధ్యాహ్నం 1:25 గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. గవర్నర్‌ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మంత్రి తలసాని, రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, సీఎస్, డీజీపీ, జీహెచ్‌ఎంసీ మేయర్‌ ఆయనకు స్వాగతం పలుకుతారు.

అనంతరం బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో బయల్దేరి 1:50 గంటలకు హెచ్‌సీయూ క్యాంపస్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి రోడ్డుమార్గంలో వెళ్లి.. 2 గంటల సమయంలో ఐఎస్‌బీకి చేరుకుంటారు.

మధ్యాహ్నం 3:15 గంటల వరకు ఐఎస్‌బీ వార్షికోత్సవం, స్నాతకోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొంటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగిస్తారు. అంతేకాదు తన చేతుల మీదుగా కొందరు విద్యార్థులకు పట్టాలు అందజేస్తారు.

3:20 గంటలకు కార్యక్రమాన్ని ముగించుకుంటారు. తిరిగి ఐఎస్‌బీ నుంచి బయలుదేరి … 3:30కు హెచ్‌సీయూకు చేరుకుంటారు. అక్కడి నుంచి హెలికాప్టర్‌లో బేగంపేటకు వెళ్తారు. 3:55 గంటలకు ప్రత్యేక విమానంలో చెన్నైకి పయనమవుతారు.

మ‌రోవైపు..ప్రధాని రాక సందర్భంగా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉ.11గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల‌కు ట్రాఫిక్ ఆంక్ష‌లు..

Related posts