ఎస్ బ్యాంక్ కుంభకోణం వ్యవహారంపై ఏపీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈరోజు ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రజల సొమ్మును దోచుకున్న ఎస్ బ్యాంక్ వ్యవస్థాపకుడు రాణాకపూర్, చంద్రబాబును కలిసిన రోజులు ఉన్నాయని విమర్శించారు. తాను దోచుకున్న డబ్బును దేశం దాటించేందుకు ఎస్ బ్యాంకుతో చంద్రబాబు చేతులు కలిపారని ఆరోపించారు.
చంద్రబాబు హయాంలో నిబంధనలకు విరుద్ధంగా టీటీడీ సొమ్మును ఎస్ బ్యాంక్ లో ఎందుకు డిపాజిట్ చేశారు? అని ప్రశ్నించారు. ఎస్ బ్యాంక్ ముడుపుల లావాదేవీల వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర ప్రభుత్వానికి విఙ్ఞప్తి చేశారు. తన మాజీ పీఎస్ అక్రమ లావాదేవీలపై చంద్రబాబు ఎందుకు నోరు విప్పలేదు? అని ప్రశ్నించారు.