ఏపీ ప్రభుత్వం నిర్వహించిన గ్రామ వార్డు, సచివాలయం పరీక్ష ప్రశ్నాపత్రాలు లీకయ్యాయని “ఆంధ్రజ్యోతి” దినపత్రికలో ఈరోజు కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ వ్యవహారంపై టీడీపీ నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఇప్పటికే అధినేత చంద్రబాబునాయుడు ఇదో పేపర్ లీక్ స్కాం అంటూ ధ్వజమెత్తాగా, ఎమ్మెల్సీ నారా లోకేశ్ కూడా ట్విట్టర్ లో ఘాటుగా స్పందించారు. పారదర్శకంగా ఉద్యోగాల భర్తీ అంటే పరీక్ష పేపరు లీక్ చేయడమా? అంటూ మండిపడ్డారు.
18 లక్షల మందికి పైగా నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడారని ఆరోపించారు. ఇదేనా మీ విశ్వసనీయత? అంటూ సీఎం జగన్ పై ధ్వజమెత్తారు. పేపర్ లీక్ కుంభకోణంపై పూర్తి స్థాయి విచారణ జరిపించాలని లోకేశ్ డిమాండ్ చేశారు. కష్టపడి చదివి పరీక్ష రాస్తే మీ పెద్దలు పరీక్ష పేపరును ముందే ఎత్తుకెళ్లిపోయారన్నారు. ఒక్కో ఉద్యోగాన్ని రూ.5 లక్షలకు అమ్ముతున్నట్టు వస్తున్న ఆరోపణలపై మీరు ఎందుకు స్పందించడంలేదని మండిపడ్డారు.