బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ సూసైడ్ సంచలనంగా మారింది. అతనిది ఆత్మహత్యే అని పోస్ట్మార్టం రిపోర్ట్లో తేలినప్పటికీ.. సుశాంత్ సూసైడ్ చేసుకునేంత పిరికివాడు కాదని, ఈ సూసైడ్ వెనుక బలమైన శక్తులు ఉన్నాయంటూ పెద్దఎత్తున ఆరోపణలు వచ్చాయి. మరోవైపు సుశాంత్ ప్రేయసి రియా చక్రవర్తిపై ఆరోపణలు గుప్పిస్తూ సుశాంత్ తండ్రి కేకే సింగ్ పాట్నా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేంద్ర ప్రభుత్వం ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించింది. ఆ వెంటనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED) కూడా రంగంలోకి దిగింది. ఈ కేసులో ముంబై పోలీసులపై బీహార్ పోలీసులు తీవ్ర ఆరోపణలు చేశారు. కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సినీనటి రియా చక్రవర్తికి ముంబై పోలీసులు సహకరిస్తున్నారని సుప్రీంకోర్టుకు తెలిపారు. ఆమెకు వ్యతిరేకంగా తాము పని చేస్తున్నామనే ఆరోపణలకు రియా ఎలాంటి రుజువులు చూపించలేకపోయిందని చెప్పారు. బీహార్ నుంచి కేసును ముంబైకి తరలించాలంటూ రియా వేసిన పిటిషన్ పై వాదనల సందర్భంగా బీహార్ పోలీసులు ఈ మేరకు స్టేట్మెంట్ ఇచ్చారు. రియాను తప్పించేందుకు ముంబై పోలీసులు యత్నిస్తున్నారని బీహార్ పోలీసులు చెప్పారు. సుశాంత్ అనుమానాస్పద మృతిపై మాత్రమే ముంబై పోలీసులు విచారణ చేయాలని, వారి కేసు పరిధి అంతవరకేనని తెలిపారు. తమ కేసులో మరిన్ని కోణాలు ఉన్నాయని చెప్పారు.
previous post
next post