*హైదరాబాద్లో భయపెడుతున్న మూసీ ప్రవాహం
*ఉస్మాన్సాగర్ -13 హిమయత్సాగర్ -8 గేట్లు ఎత్తివేత
*జంట జలాశయాలకు ఎగువ నుంచి భారీ వరద
హైదరాబాద్లో కురిసిన వానతో భారీ వరద పోటెత్తడంతో మూసీ నది ఉగ్రరూపం దాల్చింది. మూసారంబాగ్, చాదర్ఘాట్ వంతెనలపై నుంచి మూసీ నది ప్రవహిస్తోంది.
దీంతో మూసీ పరిసర ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీటమునిగాయి. అధికారులు ఈ రెండు వంతెనలను మూసివేసి రాకపోకలు నిలిపివేశారు.దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఎగువ నుంచి ఇప్పటికే వరద నీటిని వదలడంతో మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు
ఉస్మాన్సాగర్ హిమాయత్సాగర్, హుస్సేన్సాగర్ నుంచి భారీగా వరద నీరు మూసీలోకి ప్రవేశిస్తోంది. మూసీ నదిలోకి 21 వేల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో మూసీ పరివాహక ప్రాంతాల్లో అధికారులు హైఅలర్ట్ ప్రకటించారు.
మూసారంబాగ్, చాదర్ఘాట్, పురానాపూల్ వంతెనలపై రాకపోకలను నిలిపివేశారు. ఉస్మాన్సాగర్ నుంచి 8,281 క్యూసెక్కులు, హిమాయత్సాగర్ నుంచి 10,700 క్యూసెక్కులు, హుస్సేన్సాగర్ నుంచి 1,789 క్యూసెక్కుల వరద నీరు మూసీలోకి వెళుతోంది.
మరోవైపు ఇకపోతే.. తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చాలా ప్రాంతాలు నీటమునిగాయి. తెలంగాణలోని చాలా జిల్లాల్లో బుధవారం వరకు మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.
ఈ క్రమంలోనే ఎల్లో అలర్ట్ ప్రకటించింది. తెలంగాణలోని వివిధ జిల్లాల్లో జూలై 25 ఉదయం 8 గంటల నుండి జూలై 26 ఉదయం 8 గంటల వరకు 24 గంటల్లో భారీ వర్షాలు కురిశాయి. తెలంగాణ స్టేట్ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్డీపీఎస్) ప్రకారం అత్యధికంగా విఖారాబాద్ జిల్లాలో 130.5 మిల్లి మీటర్ల వర్షపాతం నమోదైంది.