దేశంలో కరోనా కట్టడికి కేంద్రం పకడ్బంధీ చర్యలు చేపెట్టేందుకు సిద్దమవుతోంది. ఈ నేపథ్యంలో కోవిడ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న ఏడు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఆరోగ్యశాఖ మంత్రులతో ప్రధాని మోదీ బుధవారం వీడియోకాన్ఫరెన్స్ ద్వారా ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు.
మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, ఉత్తర్ప్రదేశ్, తమిళనాడు, ఢిల్లీ, పంజాబ్ సీఎంలు, ఆరోగ్యశాఖ మంత్రులతో జరిగే వర్చువల్ సమావేశంలో ప్రధాని కొవిడ్ నియంత్రణ చర్యలపై సమీక్షించనున్నారు.
ఈ సమావేశంలో మహమ్మారి కట్టడికి ఆయా రాష్ట్రాలు తీసుకుంటున్న చర్యలు, కేంద్రం సహకారం, ఆరోగ్య, వైద్య మౌలిక సదుపాయాల పెంపు తదితర అంశాలను సైతం చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
దేశంలో 63శాతం యాక్టివ్ కేసులు ఈ ఏడు రాష్ట్రాల్లోనే నమోదు కాగా, మొత్తం కరోనా కేసుల్లో 65.5శాతం, మరణాల్లో 75 శాతం వరకు ఆయా రాష్ట్రాల్లోనే నమోదవుతున్నాయని గణాంకాలు చెబుతున్నాయి.