బాలీవుడ్ సీనియర్ హీరో మిథున్ చక్రవర్తి తండ్రి బసంత్ కుమార్ చక్రవర్తి ముంబైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన వయసు 95 సంవత్సరాలు. వయసు రీత్యా వచ్చే సమస్యలతో ఆయన కొంత కాలంగా బాధపడుతున్నారు. ప్రముఖ బెంగాలీ నటి రితుపర్ణా సేన్ గుప్తా ఈ విషయాన్ని ధ్రువీకరించారు. మిథున్ చక్రవర్తి కుటుంబానికి సంతాపం తెలుపుతూ ఓ ట్వీట్ చేశారు. ‘తండ్రి మరణంతో దుఃఖంలో మునిగిపోయిన మిథున్ కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నా. మీకు ఆ దేవుడు ధైర్యాన్ని ప్రసాదించాలి. మీ తండ్రి ఆత్మకు శాంతి చేకూరాలి’ అంటూ రితుపర్ణా సేన్ గుప్తా ట్వీట్ చేశారు. అయితే, మిథున్ చక్రవర్తి ప్రస్తుతం బెంగళూరులో ఉన్నారు. ప్రస్తుతం దేశవ్యాప్త లాక్ డౌన్ నెలకొనడంతో ఆయన కర్ణాటక దాటి రాలేని పరిస్థితి. ఫ్లైట్లు కూడా నిలిచిపోవడంతో మిథున్ చక్రవర్తి బెంగళూరులోనే ఉండిపోయారు. తన తండ్రిని ఆఖరిచూపు చూసేందుకు అవకాశం దక్కుతుందో లేదో చూడాలి మరి.