కేసులను మాఫీ చేసుకోవడమే ప్రధాన అజెండాగా వైసీపీ అధినేత జగన్ పెట్టుకున్నారని ఏపీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆరోపించారు. అమరావతిలో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ కేసుల నుంచి తప్పించుకోవడానికే అధికారంలోకి ఎవరు వస్తే వాళ్లకు మద్దతు తెలుపుతామని జగన్ చెబుతున్నారని విమర్శించారు. ప్రధాని మోదీ మళ్లీ అధికారంలోకి రాడన్న విషయం జగన్ కు తెలుసని, అందుకే జగన్ ఢిల్లీలో ప్లేటు ఫిరాయించారని దుయ్యబట్టారు.
ఢిల్లీలో గెలిచేవాళ్లకే జగన్ ఇప్పుడు గాలం వేస్తాడని ఎద్దేవా చేశారు. జగన్ మత గ్రంథాలను అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.గత ఎన్నికల్లో బైబిల్ పట్టుకుని తిరిగినా ఓట్లు రాలేదని ఆయనకు అక్కసుగా ఉందన్నారు. అందుకే ఇప్పుడు స్వామీజీల కాళ్లు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో ఆంధ్రులపై దాడులు జరిగినా, 26 కులాలను బీసీ జాబితా నుంచి తొలగించినా, వ్యాపారులపై దాడులు జరిగినా జగన్ ప్రశ్నించడం లేదని యనమల అన్నారు.