ఏపీ రాజ్యసభ సభ్యులు నలుగురు బీజేపీలోకి చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నలుగురు టీడీపీ రాజ్యసభ సభ్యులు వారంతట వారే బీజేపీలోకి వెళ్లలేదని, మాజీ సీఎం చంద్రబాబే వారిని ఆ పార్టీలోకి పంపారని అన్నారు. కాలం చెల్లిన నాయకులను పార్టీలో చేర్చుకుంటూ బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా మల్లు భట్టివిక్రమార్క పనికిరారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలే నిర్ణయించుకున్నారని చెప్పారు. కొత్త అసెంబ్లీ, సచివాలయాలను నిర్మించుకుంటే తప్పేంటని తలసాని ప్రశ్నించారు. ఈ నిర్మాణాలకు బీజేపీ, కాంగ్రెస్ ల అనుమతి తీసుకోవాలా? అని మండిపడ్డారు. తమిళనాడు, గుజరాత్ లలో కొత్త భవనాలు నిర్మించలేదా? అని ప్రశ్నించారు. ఈ రెండు పార్టీల నేతలు తమ పద్ధతిని మార్చుకోవాలని తలసాని సూచించారు.