భారత్-న్యూజీలాండ్ మధ్య వెల్లింగ్టన్లో జరిగిన తొలి టీ20 మ్యాచ్లో ఆతిథ్య జట్టు 80 పరుగుల తేడాతో విజయం సాధించింది. 220 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు 19.2 ఓవర్లలో ఆలౌట్ అయ్యింది. న్యూజీలాండ్ బౌలర్లలో సౌథీ 3 వికెట్లు పడగొట్టగా, ఫెర్గూసన్, శాంట్నర్, సోధీ రెండేసి వికెట్లు తీశారు. మిచెల్కు ఒక వికెట్ దక్కింది. జట్టులో 39 పరుగులు చేసిన ఎం.ఎస్.ధోనీ టాప్ స్కోరర్గా నిలిచాడు. న్యూజీలాండ్-భారత్ టీ20 సిరీస్ తొలి మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన ఆతిథ్య జట్టు 219 పరుగులు చేసింది. బదులుగా బ్యాటింగ్ ప్రారంభించిన భారత జట్టు మాత్రం 18 పరుగులకే కెప్టెన్ రోహిత్ శర్మ వికెట్ కోల్పోయింది. ఒక్క పరుగు చేసిన రోహిత్ సౌథీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. మొదటి నుంచి వేగంగా ఆడిన శిఖర్ ధవన్ జట్టు స్కోరు 51 దగ్గర అవుట్ అయ్యాడు. 29 పరుగులు చేసి ఫెర్గూసన్ బంతికి బౌల్డ్ అయ్యాడు. ధవన్ 3 సిక్సర్లు, 2 ఫోర్లు కొట్టాడు.
రిషబ్ పంత్, విజయ్ శంకర్ ఒకే ఓవర్లో అవుట్ అవడంతో జట్టు కష్టాల్లో పడింది. జట్టు స్కోరు 64 పరుగుల దగ్గర పంత్(4), మరో పరుగు తర్వాత విజయ్ శంకర్(27) శాంట్నర్ బౌలింగ్లో అవుటయ్యారు. దినేష్ కార్తీక్, హార్దిక్ పాండ్య కూడా సింగిల్ స్కోరుకే అవుటయ్యి నిరాశపరిచారు. కార్తీక్(5), హార్దిక్ పాండ్య(4) ఇద్దరూ సోధీ బౌలింగ్లో అవుట్ అయ్యారు. ధోనీ, కృనాల్ పాండ్యతో కలిసి జట్టు స్కోరును వంద పరుగులు దాటించాడు. స్కోరు 129 పరుగుల దగ్గర కృనాల్(20)సౌథీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. తర్వాత ఓవరుకే భువనేశ్వర్ కుమార్ కూడా ఒక్క పరుగు చేసి పెవిలియన్ చేరాడు. చివర్లో షాట్ కొట్టడానికి ప్రయత్నించిన ఎం.ఎస్.ధోనీ కూడా సౌథీ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. ఆఖరి ఓవర్లో యజువేంద్ర చాహల్ మిచెల్ బంతికి క్లీన్ బౌల్డ్ అవడంతో న్యూజీలాండ్కు విజయం దక్కింది.