“యాత్ర” చిత్రం ద్వారా దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టిన పాదయాత్రను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఎటువంటి కట్స్ లేకుండా క్లీన్ యూ సర్టిఫికెట్ ను సెన్సార్ బోర్డ్ ఇచ్చింది. ఈ సినిమా కోసం మొదటి సారి మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తెలుగు నేర్చుకొని డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈనెల 8న ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి ఓ వార్త వైరల్ గా మారింది. అమెరికాలోని సియాటెల్ లో ఈ చిత్రం మొదటి షో టికెట్ కు వేలంపాటను నిర్వహించగా… మునీశ్వర్ రెడ్డి అనే వ్యక్తి ఆ టికెట్ ను 6,116 డాలర్లకు సొంతం చేసుకున్నాడు. మన కరెన్సీలో దీని ధర అక్షరాలా రూ. 4.37 లక్షలు. దీంతో ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు పెరిగాయి.
ఈ చిత్రంలో రాజశేఖర్ రెడ్డి సతీమణి వైఎస్ విజయమ్మ పాత్రలో “ఆశ్రిత వేముగంటి” నటిస్తున్నారు. ఈ చిత్రంలో వైఎస్ఆర్ తండ్రి రాజారెడ్డి పాత్రలో జగపతిబాబు నటిస్తున్నాడు. ఇంకా రావు రమేష్, పోసాని కృష్ణమురళి, అనసూయ తదితరులు ఈ చిత్రంలో కీలకపాత్రల్లో నటిస్తున్నారు. దర్శకుడు మహి వి రాఘవ్ ఈ యాత్ర ని తెరకెక్కిస్తున్నారు. 70 ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ అత్యంత భారీ వ్యయంతో, ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రానికి శివ మేక సమర్పకుడు. తెలుగుతో పాటు తమిళం, మళయాలంలో కూడా “యాత్ర” చిత్రాన్ని ఫిబ్రవరి 8న విడుదల చేస్తున్నారు.