telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

21 వసంతాలు పూర్తి చేసుకున్న మహేష్ ” రాజకుమారుడు”

Rajakumarudu

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఇప్పుడు టాలీవుడ్ లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ లతో టాలీవుడ్ లో స్టార్ హీరోగా ప్రయాణం సాగిస్తున్నారు మహేష్. సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు ‘రాజకుమారుడు’ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. బాలీవుడ్ బ్యూటీ ప్రీతి జింటా హీరోయిన్‌గా నటించిన ఈ బ్లాక్ బస్టర్ మూవీ నేటికి సరిగ్గా 21 ఏళ్ల క్రితం 1999 జులై 30న విడుదలైంది. ‘రాజకుమారుడు’ సినిమా 21 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఈ సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ ఆనాటి జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ 21 ఇయర్స్ స్పెషల్ పోస్టర్‌ను ట్వీట్ చేసింది. అలాగే, సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా ట్వీట్ చేశారు. ‘‘21 ఏళ్లా… నా తొలి సినిమాను ఎంతో ప్రత్యేకంగా మలిచిన రాఘవేంద్రరావుకు కృతజ్ఞతలు. అనుభవం నుంచి నేను నేర్చుకున్న విషయం నాకెప్పుడూ గుర్తుంటుంది. మీతో, మన అద్భుతమైన టీమ్‌తో పనిచేయడం నా అదృష్టం’’ అని మహేష్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రాఘవేంద్రరావు, ప్రీతి జింటాతో కలిసి ఉన్న వర్కింగ్ స్టిల్‌ను మహేష్ తన ట్వీట్‌లో పొందుపరిచారు.

అలాగే, దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు కూడా ‘రాజకుమారుడు’ సినిమాను గుర్తుచేసుకున్నారు. ‘‘రాజకుమారుడుకి 21 వసంతాలు.. ఎన్నో మధుర జ్ఞాపకాలు.. మా అశ్వినీదత్‌కి, చిత్ర బృందానికి శుభాకాంక్షలు. మా మహేష్ బాబు ఇంకెన్నో విజయాలు సాధించాలని ఆశీర్వదిస్తున్నాను’’ అని ట్వీట్ చేశారు రాఘవేంద్రరావు. అంతేకాదు.. తనతో, సూపర్ స్టార్ కృష్ణతో, అశ్వనీదత్‌తో, ప్రీతి జింటాతో మహేష్ కలిసి ఉన్న ఫొటోలను ట్వీట్‌లో పొందుపరిచారు రాఘవేంద్రరావు.

దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతీ మూవీస్ బ్యానర్‌పై సి.అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మించిన చిత్రమిది. మెలోడి బ్రహ్మ మణిశర్మ సంగీతం సమకూర్చారు. రాజకుమారుడు’ ఎంత పెద్ద విజయం సాధించిందో ఆ సినిమా ఆల్బమ్ అంత కన్నా పెద్ద హిట్ అయ్యింది. అజయన్ విన్సెంట్ సినిమాటోగ్రఫీ అందించారు. పరుచూరి బ్రదర్స్ పవర్‌ఫుల్ డైలాగులు రాశారు. కోటగిరి వెంకటేశ్వరరావు ఎడిటర్.

Related posts