*మధ్య ప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం..
*అదుపుతప్పి నదిలో పడ్డ బస్సు..19 దుర్మణం
*15 మందిని కాపాడిన రెస్క్యూ టీమ్..
మధ్యప్రదేశ్లో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం ఇండోర్ నుంచి పూణేకి ప్రయాణికులతో వెళ్తోన్న మహారాష్ట్ర రోడ్వేస్ బస్సు ధార్ జిల్లా ఖాల్ఘాట్ వద్ద సంజయ్ సేతు వంతెనపై వెళ్తోన్న సమయంలో అదుపు తప్పి నర్మదా నదిలో పడిపోయింది.
సమాచారం అందిన వెంటనే అధికారులు సహాయ చర్యలు చేపట్టారు. సహాయక చర్యల కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందం కూడా ఘటనాస్థలికి చేరుకుంది. ఈ ఘటనలో 19 మంది మరణించగా.. మరో 15 మందిని రక్షించారు. వంతెన గోడను ఢీకొని సుమారు 20 అడుగుల ఎత్తు నుంచి బస్సు నదిలోకి పడిపోయినట్లు సమాచారం.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. ప్రమాదం అనంతరం పలువురు ప్రయాణికులు నీటిలో గల్లంతు కాగా, మరికొందరు బస్సులోనే ఇరుక్కుపోయి ప్రాణాలు విడిచారు. మిగతావారి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.
ప్రమాద ఘటనపై ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకోవాలని అధికారులను ఆదేశించారు.
సంఘటన స్థలానికి అవసరమైన వనరులను పంపాలని, గాయపడిన వారికి సరైన చికిత్స కోసం ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక, క్రేన్ సాయంతో నదిలో పడ్డ బస్సును బయటకు తీశారు.