లెజెండరీ సింగర్, గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కరోనా సోకి చెన్నైలోని ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆగస్ట్ 11న ఆసుపత్రిలో చేరిన ఆయన, ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా మారింది. తాజాగా చేసిన పరీక్షల్లో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యానికి నెగటివ్ వచ్చిందంటూ పలు సామాజిక మాధ్యమాల్లో వార్తలు రావడంపై ఆయన తనయుడు ఎస్పీ చరణ్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఓ వీడియో సందేశాన్ని పంచుకున్నారు. ప్రస్తుతం ఆయన లైఫ్ సపోర్ట్తోనే ఉన్నారని, ఆరోగ్యం నిలకడగానే ఉందని చరణ్ తెలిపారు. దయచేసి అసత్య ప్రచారాలను ఆపండి. వైద్యులతో చర్చించిన తర్వాత ఈ రోజు సాయంత్రం నేనే అప్డేట్ ఇస్తా. ధన్యవాదాలు అని పేర్కొన్నారు. కాగా ఆయన త్వరగా కోలుకోవాలని అభిమానులతో పాటుగా యావత్ సినీ లోకం కోరుకుంటుంది.
తాజాగా మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు ఎస్పీబీ త్వరగా కోలుకోవాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నట్లుగా వెల్లడించారు..ఇరవై ఏళ్ళ క్రితం గోదావరి నదీ జలాలను గ్రామగ్రామానికి తరలించడం కోసం యాత్రను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా మెడిగడ్డ నుండి పోలవరం వరకు సాగిన ఆ యాత్రలో రాష్ట్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా పాటను ఎస్పీబీ పాడారని విద్యాసాగర్ రావు అన్నారు. ఈ పాట ఆ యాత్రలో యువతను ఉర్రుతలూగించిందని, ఇప్పటికి ఆ పాట తన మదిలో మెదులుతుందని అన్నారు. ఆ పాటను వందేమాతరం శ్రీనివాస్ ద్వారా ఎస్పీబీ గారికి చేరవేస్తే మాకు రెండు రోజుల్లో అందించారని అన్నారు. ఇక ఆయన త్వరగా కోలుకుని తన అభిమానులకు మళ్ళీ తన స్వరం వినిపించాలని కోరుకుంటున్నానని అన్నారు.