దేశ వ్యాప్తంగా 17వ లోక్సభ ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. చిరు ఘర్షణలు మినహా సాయంత్రం వరకు ప్రశాంతంగా కొనసాగింది. మొత్తం ఏడు విడుతల్లో 542 లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఏప్రిల్ 11న ప్రారంభమైన లోక్సభ ఎన్నికలు ఏడు దశల్లో జరిగాయి. మొదటి దశలో భాగంగా ఏప్రిల్ 11న 91 లోక్సభ స్థానాలకు ఎన్నికలు జరగ్గా.. 69.57 శాతం పోలింగ్ నమోదైంది. రెండో దశలో భాగంగా ఏప్రిల్ 18న 95 స్థానాలకు ఎన్నికలు జరిగాయి. రెండో దశలో 69.44 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. మూడో దశలో భాగంగా ఏప్రిల్ 23వ తేదీన 116 లోక్సభ స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, 68.40 శాతం పోలింగ్ నమోదైంది.
నాలుగో దశలో భాగంగా ఏప్రిల్ 29న 71 స్థానాలకు ఎన్నికలు జరగ్గా, 65.50 శాతం పోలింగ్ నమోదైంది. ఐదో దశలో భాగంగా మే 6వ తేదీన 51 స్థానాలకు ఎన్నికలు నిర్వహించగా, 64.16 శాతం పోలింగ్ నమోదైంది. ఆరో దశలో భాగంగా మే 12న 59 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. 64.40 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. ఏడో దశ ఎన్నికలు మే 19న నిర్వహించగా సాయంత్రం 5 గంటల వరకు 64.63 శాతం పోలింగ్ నమోదైంది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ నెల 23న వెలువడనున్నాయి.