ఉత్తర్ప్రదేశ్లోని లఖింపూర్ ఖేరీలో కేసులో ప్రధాన నిందితుడు కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా డెంగీ సోకింది. ప్రస్తుతం లఖింపూర్ జిల్లా జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనను డెంగ్యూతో ఇబ్బంది పడుతున్న కారణంగా జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు జైలు సీనియర్ అధికారి ఆదివారం తెలిపారు.
ఆశిష్ రక్త నమూనాను సేకరించి వైద్య పరీక్షలు చేయగా అతడికి వెక్టార్ బోర్న్ అనే వ్యాధి ఉన్నట్లు తెలిపారు. దీంతో ఆయనను జిల్లా జైలు నుంచి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి అడ్మిట్ చేసినట్లు జైలు అధికారులు తెలిపారు.
కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు అక్టోబర్ 3న లఖింపూర్లో వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేస్తున్న రైతుల పైనుంచి కారు ఎక్కించడంతో నలుగురు రైతులు, ఒక జర్నలిస్ట్ సహా ఎనిమిది మంది చనిపోయారు. ఈ కేసుకు సంబంధించి అధికారులు మొత్తం 13 మందిని ఇప్పటివరకు అరెస్ట్ చేశారు.
కాగా.. ఆ కారు నడిపింది కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రానే అని ఆరోపణలు వచ్చాయి. దీనికి సంబంధించి కొన్ని వీడియోలు కూడా విడుదల కావడంతో అతడిని కొద్ది రోజుల క్రితం అరెస్ట్ చేశారు.