telugu navyamedia
ట్రెండింగ్ రాజకీయ

విజయ్ మాల్యాతో వైసీపీ జగన్ భేటీ.. అందుకే ఇంగ్లాండ్ వెళ్ళాడు.. : బుద్దా వెంకన్న

ycp jagan with malya meeting said budda

వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిపై టిడిపి ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన ఆరోపణలు చేశారు. తన కూతురిని కలవడానికని ఇంగ్లాండ్ కు వెళ్లిన జగన్ అక్కడ బ్యాంకులను మోసం చేసి, దేశం విడిచి పారిపోయిన విజయ్ మాల్యా ను కలుసుకున్నట్లు వెల్లడించారు. వీరిద్దరు లండన్ లోని ఓ రహస్య ప్రదేశంలో భేటీ అయినట్లు బుద్దా వెంకన్న పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లోనే లోక్ సభ ఎన్నికలతో పాటు ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో వైసీపీ పార్టీ ఆర్థిక అవసరాల గురించి వీరి మధ్య చర్చ జరిగిందన్నారు. వివిధ దేశాల్లో దాచిన డబ్బులను హవాలా మార్గంలో ఇండియాకు తరలించడానికి మాల్యా సాయాన్ని జగన్ కోరినట్లు బుద్దా వెంకన్న ఆరోపించారు.

ఆర్థిక నేరస్తుడు మాల్యాతో జగన్ జరిపిన సమావేశంపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని పేర్కొన్నారు. జగన్ కు దమ్ముంటే ఇంగ్లాండ్ పర్యటనకు సంబంధించిన పూర్తి వివరాలను బయట పెట్టాలని బుద్దా వెంకన్న సవాలు విసిరారు. వైసీపీ పార్టీకి కేంద్రంలోని అధికార బిజెపి, తెలంగాణలోని అధికార టీఆర్ఎస్ పార్టీలతో రహస్య స్నేహం కొనసాగుతోందని బుద్దా పేర్కొన్నారు.

అంతే కాకుండా, తమిళ నాడు రాజధాని చెన్నైలోని ఓ హోటల్ లోవైసీపీ నేత సుబ్బారెడ్డి తో బిజెపి నాయకురాలు పురందేశ్వరి, టీఆర్‌ఎస్‌ నేత సంతోష్‌రెడ్డి, మోహన్‌బాబు రహస్యంగా భేటీ అయినట్లు ఆరోపించారు. అక్కడ జగన్-మాల్యా…ఇక్కడ వైఎస్సార్‌సిపి-టీఆర్ఎస్-బిజెపి పార్టీల చర్చలు కూడా ఎన్నికల్లో నిధుల కోసమే జరిగాయని బుద్దా అన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా ఏపిలో మళ్లీ టిడిపి పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. మరోసారి చంద్రబాబు సీఎం కావడం ఖాయమని బుద్దా వెంకన్న ధీమా వ్యక్తం చేశారు.

Related posts